మెదక్ జిల్లాకు హరీశ్ అన్యాయం : జీవన్ రెడ్డి, కక్కుర్తికి కేరాఫ్ కల్వకుర్తి : నాగం
హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి విపక్షాలు. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిర్వాసితులతో చర్చలు జరిపిన మంత్రి హరీశ్ రావును తీరును తప్పుబట్టారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జీవన్ రెడ్డి.. మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లాకు అన్యాయం తలపెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సక్రమ పరిహారాన్ని అందించేదిగా ఉన్న భూసేకరణ చట్టం 2013 ను హరీశ్ రావు ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై అనుమానం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ విలువలు పెంచి నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి ప్రాజెక్టు ప్రభుత్వ కక్కుర్తికి నిలయం : నాగం
ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వ పోకడలను తప్పుబడుతూ పలు ఆరోపణలు చేశారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. కాంట్రాక్టర్లకు, కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు నాగం.
ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడంపై స్పందిస్తూ.. ఇందులో కేసీఆర్ ప్రమేయమే గనుక లేకపోతే 146 జీవోను తక్షణం రద్దు చేసి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జలయజ్ఞంలో అవినీతిని కాగ్ నివేదిక బయటపెట్టిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లో అక్రమాలను బీజేపీ సహించబోదని హెచ్చరించిన నాగం, రిటైర్డు ఇంజనీర్లను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం ప్రజా ధనాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
ఇక కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతోందని ఆరోపించిన నాగం, కల్వకుర్తి కక్కుర్తికి నిలయంగా మారే పరిస్థితి నెలకొందన్నారు.