రేపట్నుంచి జూనియర్ల డాక్టర్ల సమ్మె: 28 నుంచి అత్యవసర సేవలు కూడా బంద్, కరోనా కష్టకాలంలో..
హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు జూనియర్ డాక్టర్లు. తెలంగాణ వ్యాప్తంగా రేపట్నుంచి(మే 26, బుధవారం) నుంచి అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. పెంచిన స్టైఫండ్, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28వ తేదీ నుంచి అత్యవసర సేవల విధులు కూడా బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే మే 27 నుంచి పూర్తిగా విధులు బహిష్కరిస్తామని రెసిడెంట్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మే 10న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.
కాగా, జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు విధి నిర్వహణలో మృతి చెందిన జూనియర్ డాక్టర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నారు. తమకు బీమా సౌకర్యంతోపాటు తమ కుటుంబసభ్యులకు కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి వచ్చిననాటి నుంచి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా జూనియర్ డాక్టర్లు తమ సేవలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
ప్రస్తుతం తెలంగాణలో వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉండటం గమనార్హం. కేసీఆరే ఈ శాఖ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు, వైద్యారోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో జూనియర్ల డాక్టర్లు సమ్మె చేస్తే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.