ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో ఎలా ఉంటారు: సోమేష్ కుమార్కు క్యాట్
హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులకు తాము ఫలానా ప్రాంతంలో పని చేస్తామని కోరే చట్టబద్ధమైన హక్కు ఉండదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) గుర్తు చేసింది. ఆ తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్కు కేటాయించాలని ఎలా కోరుతారని జిహెచ్ఎంసీ అధికారి సోమేష్ కుమార్ను ప్రశ్నించింది.
తద్వారా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న సోమేష్ కుమార్కు క్యాట్లో నిరాశ ఎదురైంది. తెలంగాణ కేడర్కే కేటాయించాలని ఏ విధంగా కోరతారని సోమేష్ కుమార్ తరపు న్యాయవాదిని క్యాట్ ప్రశ్నించింది.
తనను తెలంగాణ కేడర్కు కేటాయించాలని, ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారి సోమేష్ ఇప్పటికే క్యాట్లో వ్యాజ్యం వేశారు. ఈ మేరకు మరోసారి దానిపై క్యాట్ సభ్యులు విచారణ జరిపారు. అఖిల భారత సర్వీసు అధికారులకు తాము ఫలానా ప్రాంతంలోనే పని చేస్తామని కోరే చట్టబద్ధమైన హక్కు ఉండదని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది క్యాట్కు తెలిపారు.
దానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాపీలను క్యాట్కు సమర్పించారు. ఈ క్రమంలోనే క్యాట్ సోమేష్ న్యాయవాదిని పైవిధంగా అడిగింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో మీ వాదనలను ఏవిధంగా సమర్థించుకుంటారో తెలపాలని కోరింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఉద్యోగుల విభజన కోసం మళ్లీ ఉద్యమం
ఉద్యోగుల విభజనలో జాప్యాన్ని నిరసిస్తూ మళ్లీ ఉద్యమించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. కమలనాథన్ కమిటీ పని తీరును నిరసిస్తూ వచ్చే నెల నాలుగో తేదీన ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహించాలని తీర్మానించాయి. ఉద్యోగ సంఘాల ఐకాస పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపాయి.
బుధవారం టీజీవోల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆ సంఘం ఛైర్మన్, శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. కమలనాథన్ కమిటీ పని తీరుపై ఉద్యోగ నేతలు మండిపడ్డారు.