సోనియా అప్పుడేం చేశారో, బిజెపి ముసుగులో టిడిపి ప్రచారం: కవిత (పిక్చర్స్)
వరంగల్: కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ రోజు వారికి రైతులు గుర్తుకు రాలేదా అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం నాడు నిలదీశారు.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆమె భూపాలపల్లిలో టిఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. సోనియా గాంధీ, ఇతర నేతలు ఇప్పుడు రైతుల పైన మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర, నష్టపోయిన పంటలకు భీమా కల్పిస్తే ఎందుకు నష్టం జరుగుతుందన్నారు.
మద్దతు ధర పెంచే బాధ్యత కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. దీనిపై బిజెపి నాయకులు మాట్లాడకుండా తమ ప్రభుత్వం పైన నిందలు వేయడం సరికాదన్నారు. విపక్షాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కవిత సూచించారు.
కవిత
పత్తికి మద్దతు ధర పెంచాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, తెలంగాణను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తోందని కవిత మండిపడ్డారు.
కవిత
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్ఎస్ పాలనను ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు.
కవిత
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీఆర్ఎస్ నేతృత్వంలో నిర్వహించిన ధూంధాంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
కవిత
అన్నం పెట్టే చెయ్యి ఆకలిని ఆలోచిస్తుంది.. ఆకలి తెలిసిన బిడ్డ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు.
కవిత
బొగ్గుతోనే కరెంటు ఉత్పత్తి అవుతుందని చెప్తూ కార్మికుల 35 రోజుల సమ్మెతో దక్షిణ భారత దేశం చీకటి మయమవుతుందనే భయంతో తెలంగాణ ఇచ్చారన్నారు.
కవిత
సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్గా ప్రకటిస్తామని చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్మికుల చెమటను గౌరవిస్తూ లాభాల శాతాన్ని పెంచి ఇప్పుడు 21 శాతం ఇస్తున్నారని తెలిపారు.
కవిత
డిపెండెంట్ ఉద్యోగాలు కూడా 3100 మందికి ఇచ్చామని, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రూ.200 కోట్లు సీఎం కేసీఆర్ మాఫీ చేశారన్నారు.
కవిత
ఆంధ్రోళ్ల పాలనలో చెరువులను ఆగం చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. పత్తికి మద్దతు ధర పెంచే అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని తెలిసినా, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారన్నారు.
కవిత
ఎన్నికల హామీల్లో ఉన్న పత్తి ధరకు అదనంగా 50శాతం పెంచుతామని ప్రకటించిన ప్రధాని మోడీ కేవలం రూ.50 మాత్రమే పెంచారన్నారు. ధర విషయంలో రైతుల పక్షాన ప్రభుత్వం పోరాడుతుందన్నారు.
కవిత
బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు వస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కవిత
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు పుట్ట మధు, హన్మంత్ షిండే, ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇంఛార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.