రాజకీయం ప్రాధాన్యం: కెసిఆర్-బాబు 'విభజన', ఏకాంతంగా 15ని.లు (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు కలిసినా రాజకీయ ప్రాధాన్యం ఏర్పడుతోంది. రాష్ట్ర విభజన, ఓటుకు నోటు, ఆ తర్వాత అమరావతికి ఆహ్వానం వంటి అంశాల నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఎప్పుడూ చర్చకు దారి తీస్తోంది.
సోమవారం నాడు కెసిఆర్ బెజవాడ వెళ్లి స్వయంగా చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానించారు. ఇది కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. పైగా ఇరువురు నేతలు ఏకాంతంగా పదిహేను నిమిషాల పాటు చర్చించారు.
తన క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కెసిఆర్ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. ఆంధ్రా రుచులతో వంటకాలు వడ్డించారు. అదే సమయంలో ఇరువులు పలు అంశాలపై గంటన్నర పాటు చర్చించారు. కెసిఆర్-చంద్రబాబుల మధ్య అధికారిక భేటీ కాకపోయినప్పటికీ పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది.
విభజన అనంతరం కెసిఆర్ - చంద్రబాబులు పలుమార్లు కలుసుకున్నా, ఎక్కడ కలుసుకున్నా తెలుగు ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. అందుకు విభజన, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్లతో పాటు తెలంగాణ - ఏపీల మధ్య విభజన సమస్యలు ఉండటం కూడా ఓ కారణం.
విభజన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఆ అంశాల పైన వారు గతంలో గవర్నర్ సమక్షంలో ఓసారి భేటీ అయ్యారు. ఓటుకు నోటు తెరపైకి వచ్చింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారయింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ఇరువురిని కలిపింది!
ఇప్పుడు తాను నిర్వహిస్తున్న చండీయాగానికి కెసిఆర్.. చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా విభజన సమస్యల పైన కూడా వారు చర్చించారని తెలుస్తోంది. వారిద్దరు పావుగంట ఏకాంతంగా భేటీ అయిన సందర్భంగా విభజన సమస్యలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ నీటి పైన, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు వివాదాస్పద అంశాలపై చర్చించారని సమాచారం. అలాగే, రెండు రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇరు రాష్ట్రాల చరిత్ర తదితర అంశాలపై చర్చించారు. కెసిఆర్కు చంద్రబాబు ఆంధ్రా వంటకాలు రుచి చూపించారు.
చంద్రబాబును ఆహ్వానించిన కెసిఆర్... ఈ నెల 27వ తేదీన మంచి ముహూర్తం ఉందని, అదే రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వస్తున్నారని, ఆ రోజు రావాలని చంద్రబాబును కోరారు. కెసిఆర్ చండీయాగానికి చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులనూ ఆహ్వానించారు.
కాగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణ సీఎం కేసిఆర్.. రాత్రి గవర్నర్ నరసింహన్ నివాసానికి వెళ్లారు. సతీసమేతంగా రాజ్ భవన్ వెళ్లారు. తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రం అందించారు. గవర్నర్కుసీఎం బొట్టు పెట్టి, శాలువా కప్పారు.
కెసిఆర్-బాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన యాగ ఆహ్వాన పత్రికను చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
కెసిఆర్-బాబు
తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్వాగతం చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
కెసిఆర్-బాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన యాగ ఆహ్వాన పత్రికను చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నవ్వుకుంటూ ముఖ్యమంత్రులు
కెసిఆర్-బాబు
బెజవాడలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వాహనం దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం చంద్రబాబులు పరస్పరం నమస్కరించికుంటూ..
కెసిఆర్, బాబు
తెలంగాణ సీఎం కెసిఆర్కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాలువా కప్పారు. వెళ్తున్న సమయంలో కెసిఆర్.. చంద్రబాబుకు నమస్కరించగా, చంద్రబాబు ప్రతి నమస్కారం.
కెసిఆర్, బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాలువా కప్పారు.