58ఏళ్లు నాశనం చేశారు, వీళ్లా చెప్పేది: విపక్షాలపై విరుచుకుపడిన కెసిఆర్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 58ఏళ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని ఇన్నేళ్లు నాశనం చేసినవారు 15 నెలల్లో మీరేమీ చేయలేదని అడిగితే ఎట్లాగని నిలదీశారు. వాళ్లు నాశనం చేసిన రాష్ర్టాన్ని బాగుచేసేందుకు తాము కొత్త చరిత్ర ప్రారంభించామని చెప్పారు.
తెలంగాణకు కొత్త చరిత్ర ప్రారంభమైందని, పునాది వేస్తున్నామని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తప్పు చేయనన్నారు. 58 ఏళ్ళపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెదేపా హయాంలో తెలంగాణకు దగా జరిగిందని విమర్శించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా తాము నడుస్తామని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాలు ఉన్నాయని, ఏ రాష్టమ్రైనా 8.5 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చేయగలదా? అని ప్రశ్నించారు.
రైతుల సమస్యలపై రెండు రోజులపాటు అసెంబ్లీలో చర్చించామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇళ్లకు బంగారు వాసాలు కట్టించారా? అని కోపంగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు ఎవరు కారణం? మీ అవివేకమైన పాలన కాదా? అంటూ నిలదీశారు. రైతుల ఆత్మహత్యలకు కారణమెవరన్న ప్రశ్న తాము ప్రతిపక్షాలను అడగాల్సిందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించాలని స్పీకర్ సూచించినా విపక్షాలు వినిపించుకోకుండా గెంటివేయించుకున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీని వదిలి బయటకెళ్లి ఎవరకోసం భరోసా యాత్రలు నిర్వహిస్తున్నారంటూ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
విపక్షాలవి అలవికాని కోరికలుగా అభివర్ణిస్తూ, రాబోయే రోజుల్లో నీటి పారుదల రంగంలో విప్లవం చూడబోతున్నారన్నారు. నీటి పారుదల రంగం, రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూపిస్తామని తాను అంటే, ఒక ఎమ్మెల్యే సినిమా చూపిస్తారట అని మాట్లాడారని, అది వారి సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు.
అసెంబ్లీలో బుధవారం సంక్షేమరంగంపై జరిగిన చర్చలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లెవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.