ఆంధ్ర అనుకరణపై కెసిఆర్ సెటైర్లు: చంద్రయ్య కథ
హైదరాబాద్: తెలియని భాషలో మాట్లాడడం మంచిది కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సలహా ఇస్తూ చంద్రయ్యకు సంబంధించిన సంఘటనను చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో ఆయన ఆదివారంనాడు ఆ కథ వినిపించారు.
తెలిసిన భాషలో స్వేచ్ఛగా మాట్లాడాలే తప్ప తెలిసీ తెలియని భాషతో తిప్పలు పడవద్దని కేసీఆర్ అన్నారు. వచ్చీరాని ఆంధ్రయాస ఎలాంటి తంటాలు తెస్తుందో పిట్టకథల ద్వారా ఆయన వివరించారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు చంద్రయ్య అనే నాయకుడిని ఎంపీపీగా చేశామని, పదవి రానపుడు తెలంగాణ యాసలో మాట్లాడే ఆయన పదవి వచ్చిన తర్వాత ఆంధ్రయాసలో మాట్లాడడం మొదలు పెట్టాడని వివరించారు.
ఈ క్రమంలో ఓ రోజు సిద్దిపేట సమీపంలోని పాలమాకులకు ఓ శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లామని అక్కడ జరిగిన సభలో ఎంపిపి చంద్రయ్య కొంచెం ఆంధ్రోళ్ల భాష మాట్లాడాడని అన్నారు. మన పాలమాకుల అభివృద్ధికి ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషి, నాకృషి వలన సంతోషంగా ఉంటున్నాం.ఇంతగా అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేకు నా నివాళి అన్నాడని ఆయన వివరించారు.
దాంతో ప్రజలు నవ్వుకున్నారని, ఆ సభలో తమతో పాల్గొన్న ఒక మైనార్టీ నాయకుడికి ఇది అర్థం కాలదని, కారులో తిరిగి వచ్చేటపుడు అన్నా చంద్రయ్య ఏం మాట్లాడిండు ఎందుకు జనం నవ్విండ్రు అని అడిగితే విషయం ఇదీ అని చెప్పానని,త దానికి ఆయన కారు ఆపు అని చంద్రయ్య కారు దిగు అంటూ పెద్ద పంచాయతీ పెట్టాడని కెసిఆర్ చెప్పారు.
అయినా చంద్రయ్య మారలేదని, మరోసారి మిట్టపెల్లి గ్రామం నుంచి జిల్లా డీసీసీబీ వైస్చైర్మన్గా రామకృష్ణ ఎంపికైన సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమానికి వెళ్లి రామకృష్ణను ప్రశంసిస్తున్నాననుకొని ...రామకృష్ణ డీసీసీబీ వైస్ చైర్మెన్గా ఎన్నికవడం మన గ్రామానికి మాయని మచ్చ అంటూ మాట్లాడడంతో సభలో ఉన్నవాళ్లంతా గొల్లు మన్నారని వివరించారు.
ఏదో మాట్లాడబోయి ఏదో చేస్తే ఇలాగే ఉంటుందని, చక్కగా వచ్చిన భాష, యాసలో మాట్లాడితే మంచిదని ఆయన చెప్పారు.