టెక్కీలు ఈర్ష్య పడే విధంగా వ్యవసాయ ఫలాలు: తుమ్మల
ఖమ్మం: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈర్ష్యపడే స్థాయిలో రైతాంగం వ్యవసాయ ఫలాలను అందుకునే రోజు దగ్గర్లోనే ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. రైతును రాజుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పమని ఆయన చెప్పారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్తో జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పది రోజుల్లో ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీరాంసాగర్ సాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారని తమ్మల చెప్పారు. ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను మంజూరు చేసిన కేసీఆర్కు జిల్లా రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాని ఆయన చెప్పారు.
టెండర్లకు కాంట్రాక్టర్లు రావట్లేదు: ఇంద్రకరణ్ రెడ్డి
అదిలాబాద్ జిల్లాలో ఏదో ఓ గ్రామంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం పేరుతో విద్యార్థి నాయకులు రాజకీయం తగదన్నారు. వచ్చే బడ్జెట్లో నియోజకవర్గానికి 1500 ఇల్లు కేటాయిస్తామని చెప్పారు.
ఒక్కో ఇంటికి రూ.6.30 లక్షలు ఇస్తున్నా టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు రావడం లేదన్నారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సమ్మక్క - సారక్క జాతర ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది నాగోబా జాతర అభివృద్ధికి రూ.3 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు.