60ఎకరాల్లో టీఆర్ఎస్ ప్లీనరీ.. 75ఎకరాల్లో పార్కింగ్: కేటీఆర్
ప్రధాన సభ ప్రాంగణం 5ఎకరాల్లో ఉంటుందని తెలిపారు. మొత్తం ప్లీనరీ 60ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ 21శాతం వృద్ధి రేటుతో ముందు వరుసలో ఉందన్నారు.
ఇదే సందర్బంగా కొంపెల్లిలో ఈ నెల 21న నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల గురించి కేటీఆర్ వివరించారు. 10నుంచి 16వేల మంది ప్రతినిధులు ప్లీనరీలో పాల్గొంటారని, ప్రధాన సభ ప్రాంగణం 5ఎకరాల్లో ఉంటుందని తెలిపారు. మొత్తం ప్లీనరీ 60ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
సభకు హాజరయ్యేవారికి భోజన సదుపాయం, మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సహా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతినిధులకు, వీఐపీలకు, మీడియాకు వేర్వేరుగా ఆరు భోజన శాలలు ఏర్పాటు చేస్తున్నామని, సీఎంకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుందని అన్నారు.
రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సమావేశ ప్రాంగణానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 75ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 31జిల్లాలకు సంబంధించిన 31కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. సమావేశ ప్రాంగణానికి కొన్ని ప్రధాన రహదారులను కూడా అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని తీరులో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 15వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. టీఎస్ఐపాస్తో పారిశ్రామిక విధానాన్ని కొత్త పుంతలు తొక్కించినట్లు తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు తీసుకొచ్చామన్నారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా నిలిచిందన్నారు.