చర్యలు తప్పవు: రేవంత్కు ఎల్ రమణ పరోక్ష హెచ్చరిక
తెలుగుదేశం పార్టీలో నేతలందరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.రమణ శన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నేతలందరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రమణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పదవులు, అధికారం కోసం ఎప్పుడు పాకులాడలేదని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అధినేత ఆదేశాల మేరకే ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలను గందరగోళ పరిచేలా నాయకులు మాట్లాడొద్దని, మీడియాలో వస్తున్న వార్తలపై నాయకులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ సిద్ధాంతాలు, భావసారూప్యత ఉన్న పార్టీలతోనే కలిసి వెళ్తామని రమణ చెప్పారు. పొత్తులపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంలోనే ముందుకెళ్లాలని అన్నారు. పార్టీ నాయకత్వానికి భిన్నంగా వ్యవహరించొద్దని అన్నారు.
తెలుగుదేశం మహానాడుల్లో కీలకమైన అంశాలను చర్చించామని చెప్పారు. టీడీపీ కార్యకర్తల విశ్వాసం దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించొద్దని ఎల్ రమణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తాజా పరిణామాలపై చర్చిస్తామని ఎల్ రమణ తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రమణ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.