లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలి.!కరోనా ఉదృతిని కట్టడిచేయాలంటే తప్పదన్న డిజిపి.!
హైదరాబాద్: కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పొడగించిందని, కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. లాక్డౌన్ అమలుపై జోనల్ ఐజి లు, డి.ఐ.జి లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డి.జి.పి జితేందర్, ఇంటలిజెంట్స్ విభాగం ఐ.జి ప్రభాకర్ రావు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫ్ రెన్స్ లో డి.జి.పి మాట్లాడారు.
కఠినంగా అమలు చేయనున్న లాక్డౌన్ ఆంక్షలు.. పోలీసు ఉన్నతాదికారులకు డిజీపి ఆదేశాలు..
రాష్ట్రంలో లాక్డౌన్ అమలుతీరును ప్రతిరోజు జిల్లాల వారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షిస్తున్నారని తెలియజేశారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ ను పొడగించేందుకు వీలు లేకుండా ప్రస్తుత లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6గంటల నుండి 10 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని ఇది ప్రమాదకరం అన్నారు.
కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే వాహనం సీజ్.. పోలీసులు అలర్ట్ గా ఉండాలన్న డీజిపి మహేందర్ రెడ్డి.
దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుండే పోలీసు కమిషనర్లు, ఎస్.పి.లు, డి.సి.పి, డి.ఎస్.పి, ఏ.సి.పి స్థాయి ఉన్నతాధికారులందరూ కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అకారణంగా రోడ్లపైకి వచ్చేవారిని నియంత్రించాలని డీజిపీ సూచించారు.
ఇక కాలనీల్లో కూడా పెట్రోలింగ్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు..
అంతే కాకుండా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించేవిధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
కరోనా కట్టడికి పోలీసుల కఠిన చర్యలు.. ప్రజలు సహకరించాలన్న డిజీపి..
లాక్డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖ పై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని డిజీపి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.