తలసానితో పోరు: గవర్నర్ను టార్గెట్ చేసిన మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్పై సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పోటీ పడడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామా వ్యవహారం ఎంత త్వరగా తేలిపోతే అంత త్వరగా సనత్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్పై పోటీ పడి తెలంగాణ శాసనసభలో ప్రవేశించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అయితే, నేరుగా మర్రి శశిధర్ రెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా గవర్నర్ నరసింహన్ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడాన్ని తన తండ్రి మర్రి చెన్నారెడ్డి నుంచి మర్రి శశిధర్ రెడ్డి వారసత్వంగా తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి దండే విఠల్పై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్పై పోటీ చేయాల్సి ఉంటుంది. తలసాని టిఆర్ఎస్లో చేరడంతో టిడిపి బలంగా పూర్తిగా తగ్గినట్లే. దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్పై తనకు ముఖాముఖి పోటీ ఉంటుందని శశిధర్ రెడ్డి భావిస్తున్నారు.
పార్టీ మారడంతో తెలసానిపై వ్యతిరేకత ఉండే అవకాశం ఉందని, టిడిపి ఓట్లు కూడా తలసానిపై వ్యతిరేకతతో తనకు పడితే తాను గెలిచే అవకాశాలు లేకపోలేదని మర్రి శశిధర్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చు. మర్రి శశిధర్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1994లోనూ ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1999లో మాత్రం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్ రాజేశ్వర్ గెలిచారు.
మర్రి శశిధర్ రెడ్డికి ముందు 1989 ఎన్నికల్లో ఆయన తండ్రి మర్రి చెన్నారెడ్డి విజయం సాధించి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామా ఆమోదం పొందితే తిరిగి పోటీ చేసే అవకాశం ఉంటుందని, 2019 దాకా ఆగాల్సిన అవసరం లేదని శశిధర్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, ఆయన అన్ని విషయాలనూ పక్కన పెట్టి తలసాని వ్యవహారం మీదనే దృష్టి కేంద్రీకరించి పని చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.