వివేక్ కంపెనీ నుంచి రూ.75 కోట్లు కోమటిరెడ్డి కంపెనీకి బదిలీ!!
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పునకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలేనని పెద్దలు చెబుతుంటారని, మునుగోడు ఉప ఎన్నికను బలవంతంగా ప్రజలపై రుద్ది నరేంద్రమోడీ, అమిత్ షాలాంటివారికి ఓటర్లు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఆత్మగౌరవానికి పట్టం
అభివృద్ధికి, ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారన్నారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభ్రదంతోపాటు ఇతర నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. మునుగోడులో ప్రత్యక్షంగా పోటీచేసింది రాజగోపాల్ రెడ్డి కావొచ్చని, కానీ మోడీ, అమిత్ షా వెనకుండి నడిపించారని, మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుకు వారికి చెక్కర్ వచ్చిందన్నారు.
ప్రభుత్వాలను కూలదోసే క్రీడ
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసే క్రీడకు బీజేపీ తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. సుశీ ఇన్ ఫ్రా నుంచి మునుగోడు ప్రజల ఖాతాల్లోకి రూ.5.25 కోట్లు బదిలీ చేశారని, డాక్టర్ వివేక్ గుజరాత్ నుంచి రూ.2.5 కోట్లు హవాలా ద్వారా తెప్పించింది నిజంకాదా? అని ప్రశ్నించారు.వివేక్ కంపెనీ నుంచి రూ.75 కోట్లు రాజగోపాల్ రెడ్డి కంపెనీకి బదిలీ చేశారని చెప్పారు. వీటన్నింటినీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఈసీపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా చేశారని కేటీఆర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు ధనమయంగా మారిందో ప్రజలు ఆలోచించాలన్నారు.
ప్రజాస్వామ్యంపై ధనస్వామ్యంతో దాడి
తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ఉప ఎన్నికలు జరిగాయని, కానీ మునుగోడే ఎందుకంటే ధనవంతులు తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి పీఏ నివాసంలో డబ్బులు దొరికాయంటూ అసత్య ప్రచారం చేశారని, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించగలిగారు కానీ, గెలుపును అడ్డుకోలేక పోయారన్నారు.
ఓటమిని హుందాగా ఒప్పుకునే ధైర్యం బీజేపీ నేతలకు లేదన్నారు. కారును పోలిన గుర్తులకు 6వేల ఓట్లు పోలయ్యాయని, ఈవీఎంలను మేనేజ్ చేస్తామని ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు కూడా చెబుతున్నారని, కర్రు కాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కు అదనంగా 9 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు.