వీణా-వాణీ ఆపరేషన్ బాధ్యత మాదే: మంత్రి, 12ఏళ్లు దాటినందున వేరే ఆసుపత్రికి
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా - వాణీల శస్త్ర చికిత్స బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మా రెడ్డి చెప్పారు. దీని పైన ఎయిమ్స్కు లేఖ రాసినట్లు చెప్పారు. త్వరలో ఎయిమ్స్ బృందం హైదరాబాద్ వచ్చి వీణ - వాణిలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుందన్నారు.
ప్రభుత్వానికి నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు లేఖ రాశారని చెప్పారు. వీణ వాణీలకు వయస్సు పన్నెండేళ్లు దాటినందున వేరే ఆసుపత్రికి మార్చాలని వైద్యులు లేఖలో కోరారని ఆయన తెలిపారు. ఏ ఆసుపత్రికి తరలించాలన్న దాని పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా, వీణా - వాణిల శస్త్ర చికిత్స విషయంలో స్పష్టత కరువైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ ద్వారా వారిని వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారు.
అయితే ప్రభుత్వం శస్త్ర చికిత్స విషయం ఎయిమ్స్ చేతిలో పెట్టింది. లండన్ వైద్యులను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖర్చు పైన స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
అదే సమయంలో శస్త్ర చికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకు వస్తారా అడిగి తెలుసుకోవాలని కోరింది. ఇది జరిగి అయిదు నెలలు దాటింది. ఇప్పటి వరకు ముందడుగు పడలేదంటున్నారు. దీంతో, ఎయిమ్స్ చేతులెత్తేసిందా అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు.