వచ్చే 3 రోజులే కీలకం: కరోనా వ్యాప్తిపై హరీశ్ రావు ఏమన్నారంటే.?, కోవిడ్ బారినపడిన డీహెచ్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. నారాయణపేట జిల్లా కోయిల్కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంగళవారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తామని, నారాయణపేటలో రూ. 66 కోట్లతో 300 పడకల ఆస్పత్రి నిర్మించబోతున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని
వచ్చే మూడు వారాలే కీలకమంటూ కరోనా వ్యాప్తిపై హరీశ్ రావు
కరోనావైరస్ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే మూడు వారాలు చాలా కీలకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందరూ తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని, ఏఎన్ఎం సబ్ సెంటర్, పీహెచ్సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కరోనా పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ హరీశ్ రావు
ఎంతమందికి కరోనా వచ్చినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల కోవిడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉందని, కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని ఇచ్చిన మందులను వారం రోజులపాటు వాడితే తగ్గిపోతుందన్నారు. ప్రజాప్రనిధులు, అధికారులు 100 శాతం వ్యాక్సిన్ అందించే విధంగా కృషి చేయాలన్నారు.
Recommended Video
తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించాయి. పరీక్ష ద్వారా కోవిడ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్, తగిన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా అని డీహెచ్ శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో దాదాపు 80 మందికి కరోనా సోకింది. ఉస్మానియా ఆస్పత్రిలో 180 మంది వరకు వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. నీలోఫర్ ఆస్పత్రిలోనూ 25 మందికి కోవిడ్ బారినపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో 32 మంది సిబ్బందికి కరోనా సోకింది. ప్రజలతోపాటు వైద్యులు కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.