‘మెట్రో’లో మాకు ప్రాధాన్యతేది?: జీహెచ్ఎంసీ బాసుల ఆవేదన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ స్టేషన్లో మెట్రోరైలును మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు .
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ స్టేషన్లో మెట్రోరైలును మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారకరామారావు తదితరులు పాల్గొంటారు.
ఇది ఇలావుంటే, హైదరాబాద్కు మణిహారంగా నిలవనున్న మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక బల్దియా పెద్దలకు ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.

ప్రాధాన్యతేదీ?
మెట్రో రైలు ప్రారంభోత్సవ ఫైలాన్లోనూ, ఎల్ అండ్ టీ మెట్రో లిమిటెట్ విడుదల చేసిన వోచర్లోనూ జీహెచ్ఎంసీ పాలకులకు, యంత్రాంగానికి ప్రాధాన్యం లభించలేదు. మెట్రో ప్రారంభోత్సవ శిలాఫలకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారకరామారావు పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ విస్మయం
శిలాఫలకం బయటకు కనబడకుండా ఇప్పటికే వస్త్రంతో మూసేయడం గమనార్హం.
మెట్రో రైలు ఫైలాన్, వోచర్లో హైదరాబాద్ మేయర్ పేరుగానీ, జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుగానీ లేకపోవడంపై బల్దియా వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

కార్పొరేటర్ల అసంతృప్తి
ప్రధాని మోడీతో కలిసి మెట్రో రైల్లో ప్రయాణం చేసేవారి జాబితాలో మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ కమిషనర్ లేకపోవడంపై కార్పొరేటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బల్దియా బాసులు ఆవేదన
హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఇంతటి చరిత్రాత్మక కార్యక్రమంలో జీహెచ్ఎంసీకి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్ఎంసీకి తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వారు వాపోయారు.












Click it and Unblock the Notifications