ప్రజలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూపులు.!కేసీఆర్ ఎప్పుడు దిగిపోతాడా అని.!ఈటెల సంచలన వ్యాఖ్యలు.!
హైదరాబాద్ : మెదక్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతులకు హాజరైన హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎప్పుడు దిగిపోతాడా అని యావత్ తెలంగాణ ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రజా క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలిపోయిందని, తెలంగాణ మంత్రుల మాటలకు, ఆచరణకు పొంతనలేకుండా ఉందని మండి పడ్డారు ఈటల రాజేందర్.
తెలంగాణ ఫలాలు ప్రజలకు అందలేదు.. అందించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలం చెందాడన్న ఈటల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందించడంలో చంద్రశేఖర్ రావు ఘోరండా విఫలమయ్యారని, ఇప్పుడు ఆ ఫలాలు ప్రజలకు అందించాల్సినకర్తవ్యం బీజేపి నేతల మీద ఉందని స్పష్టం చేసారు. మెదక్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయడం బీజేపి నేతల లక్ష్యమని, త్యాగాలు లేకుండా ఫలాలు సాధ్యం కావని వివరించారు. ఒక తరం త్యాగం చేస్తేనే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వేచ్ఛ లభించిందని, అజాదీకా అమృతోత్సవ్ జరుపుకుంటున్నామని అన్నారు.
కేసీఆర్ కు డిపాజిట్ దక్కదు.. అలా చేసే పార్టీ బీజేపి ఒక్కటేనన్న ఈటల
దేశంలో ప్రదాని నరేంద్ర మోడీ ప్రజామోదమైన పాలన అందిస్తున్నారని, రైతు చట్టాలను వెనక్కి తీసుకొని గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. రెండు సీట్ల నుండి 303 సీట్లకు ఎదిగి అజేయంగా నిలిచిన పార్టీ బీజేపీ అని గుర్తు చేసారు ఈటల. చంద్రశేఖర్ రావుకు భవిష్యత్తులో డిపాజిట్ రాకుండా చేసే పార్టీ బీజేపీ అని హెచ్చిరంచారు. చంద్రశేఖర్ రావు పాలన రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు భావిస్తున్నారని ఈటల మండిపడ్డారు. చంద్రశేఖర్ రావు అహంకారం, నియంతృత్వ పోకడలకు చరమగీతం తప్పదని ఈటల అన్నారు.
హుజురాబాద్ దెబ్బకు ఇందిరా పార్క్ లో పడ్డ కేసీఆర్.. గులాబీ పార్టీకి బీజేపి చుక్కలు చూపిస్తుందన్న ఈటల
365 రోజుల్లో, 142 రోజులు ఫామ్ హౌస్ లో కూర్చుని పరిపాలించిన ఏకైక సీఎం చంద్రశేఖర్ రావని, హుజూరాబాద్ దెబ్బకు ఫామ్ హౌస్ వదిలి పెట్టారని, దెబ్బకు ధర్నాచౌక్ కి వచ్చి పడ్డారని ఎద్దేవా చేసారు. హుజూరాబాద్ లాగా తెలంగాణ ప్రజలు కూడా ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎదురుచూస్తున్నారని, 90 శాతం ప్రజానీకానికి ఏ పార్టీతో సంబంధం ఉండదని, నమ్మితే ప్రజలు మనవెంటే నడుస్తారని అన్నారు. మెదక్ జిల్లాలోనే తన పౌల్ట్రీ ఫామ్ ఉందని, ఒక్క ఎకరం కబ్జా ఉన్నా ముక్కునేలకు రాస్తానని గతంలో చెప్పామని, దానికి కట్టుబడి ఉన్నామనన్నారు ఈటల రాజేందర్.
కేసీఆర్ ది పవర్ ఓరియంటెడ్ సర్కార్, పీపుల్ ఓరియంటెడ్ సర్కార్ కాదన్న ఈటల
కలెక్టర్ చేతనే అబద్ధాలు చెప్పిస్తున్నారని, చంద్రశేఖర్ రావు దగ్గర ఉంటే మంచి వాడు. లేడంటే చెడ్డవాడా? అని నిలదీసారు. ధాన్యం సేకరణలో చంద్రశేఖర్ రావు విఫలమయ్యారని, ముందస్తు ప్రణాళిక లేక బొక్క బోర్లా పడ్డారని ధ్వజమెత్తారు. 10 లక్షల టన్నుల కెపాసిటీగల మిల్లులు. 10 క్లస్టర్స్ పెడితే కోటి టన్నుల బియ్యం పట్టవచ్చు. కానీ ఆ ప్రణాళిక చేయకుండా నెత్తిమీదకు తెచ్చుకున్న వ్యక్తి చంద్రశేఖర్ రావు అని పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయలు ఖర్చుపెడితే రైతులను ఆదుకోవచ్చు కానీ అది చేయకుండా చంద్రశేఖర్ రావు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రశాఖర్ రావు చెపితే ఎవరన్నా నమ్మేవారు ఉన్నారా అని నిలదీసారు ఈటల రాజేందర్.