పెట్రో ఝలక్: అర్ధరాత్రి నుంచి బంకుల్లో ఏటీఎం కార్డులు బంద్
నోట్ల రద్దు కారణంగా ఇన్నాళ్లు ఇబ్బందులుపడి, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సాధారణ ప్రజలకు మరో షాక్! వాహనదారులకు పెట్రోలు బంకులు భారీ ఝలక్ ఇచ్చాయి.
హైదరాబాద్/విజయవాడ/న్యూఢిల్లీ: నోట్ల రద్దు కారణంగా ఇన్నాళ్లు ఇబ్బందులుపడి, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సాధారణ ప్రజలకు మరో షాక్! వాహనదారులకు పెట్రోలు బంకులు భారీ ఝలక్ ఇచ్చాయి.
ఈ రోజు (ఆదివారం) అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోలు బంకుల్లో ఏటీఎం కార్డుల ద్వారా చెల్లింపులు నిలిచిపోనున్నాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై పెట్రోలు బంకుల డీలర్ల నుంచే అదనపు చార్జీలను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
దీనికి నిరసనగా తాము కార్డు లావాదేవీలను నిషేధిస్తున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ అర్ధరాత్రి నుంచి దీనిని అమలు చేయనున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సంఘం సంయుక్త కార్యదర్శి అమరమ్ రాజీవ్ తెలిపారు.
డీజిల్పై 2.5శాతం, పెట్రోల్పై 3.2శాతం చొప్పున డీలర్లకు కమిషన్ వస్తుందని, అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదని ఈ సందర్భంగా తెలిపారు. తమ లావాదేవీల్లో 80 శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయన్నారు.
ఇలాంటప్పుడు అదనపు ఛార్జీలు డీలర్లు వద్ద వసూలు చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అమ్మకాలు నిలుపుదల చేస్తున్నట్లు ఏపీ పెట్రోల్ బంకుల యజమానుల సంఘం కూడా తెలిపింది.