రండి, మా రాష్ట్రం కాదనుకుంటే మీ ఇష్టం: సినీ తారలకు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రైతులకు అందరూ అండగా నిలవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నాడు పిలుపునిచ్చారు. రైతులకు భరోసా కల్పించేందుకు సినీ నటులు ఏ కార్యక్రమం చేపట్టినా తమ సహకారం ఉంటుందన్నారు.
ఇది మా రాష్ట్రం కాదని వారు భావిస్తే వారిష్టమని, వారు స్పందించాలని సూచన మాత్రమే చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల నటులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అండగా ఉండాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజ స్వరూపం క్రమంగా బయటపడుతోందని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. రైతు సమస్యల పైన రెండు రోజుల పాటు అసెంబ్లీలో చర్చ జరిగినా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు.
రైతులకు భరోసా కల్పించేందుకే తాము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పైన శాశ్వత పరిష్కారానికి తాము పోరాడుతామని చెప్పారు.
కాగా, రైతుల్లో భరోసా కోసం టిడిపి బస్సు యాత్ర చేపట్టింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రలో బిజెపి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకే ఈ యాత్ర అన్నారు.
యూత్ కాంగ్రెస్ ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిరసిస్తూ అసెంబ్లీ ఎదుట యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. అసెంబ్లీలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి ఎన్నిక
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా నేతి విద్యాసాగర్ మంగళవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్రాల హక్కులను హరించొద్దు: ఈటెల
పన్నులు విధించడంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించకుండా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
ఆస్ట్రేలియా దేశంలో అమలవుతున్న జీఎస్టీ పన్ను విధానంపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన ఈటెల సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.