కేసీఆర్! దమ్ముంటే కోడంగల్కు రా.. మేమెంటో తెలుస్తుంది: రేవంత్ సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్/కోడంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'నీకు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కోడంగల్కు వచ్చి మీటింగ్ పెట్టు.. మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుంది' అని రేవంత్ సవాల్ విసిరారు.

కేసీఆర్ చెంచాపై..
కోస్గిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు.

చెల్లని రూపాయిని తెచ్చి..
ఇప్పుడు తన మీద తాండూరులో చెల్లని రూపాయిని దింపి చెల్లిపిస్తాడని మాట్లాడుతున్నాడని కేసీఆర్నుద్దేశించి రేవంత్ విమర్శించారు. నాడు డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.250 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం తీసుకొచ్చానని ఆయన చెప్పారు.

తమపై కక్షతోనే..
2007లో భీమా ప్రాజెక్టును తాము సాధించుకున్నామని, నేడు తమ మీద కక్షతో భీమా ప్రాజెక్టులు పూర్తి కాకుండా పక్కకు పెట్టారని రేవంత్ ఆరోపించారు. కొడంగల్ అభివృద్దిని అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీనేనని రేవంత్ ఆరోపించారు.

అందుకే కాంగ్రెస్లో చేరా..
నందారం వెంకటయ్య చివరి కోరిక కోస్గిలో బస్ డిపో నిర్మాణమని.. ఇందుకోసం తాను.. తన సోదరుడి పేరుమీద 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించామని.. 40 నెలలైనా ఎందుకు బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలవడం లేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ, కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పెంచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్పై పోరాటం చేస్తున్నానని రేవంత్ తెలిపారు. కాగా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications