మణిపూర్కు సైన్స్ కాంగ్రెస్: ఓయూలో ఉద్రిక్తత, ఏయూకు నో ఛాన్స్
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన ప్రతిష్టాత్మక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మణిపూర్కు తరలించారు. ఇటీవల వాయిదా వేసిన ఈ సదస్సును ఇప్పుడు మణిపూర్కు తరలించడంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత హైదరాబాద్లోని ఉస్మానియాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించేందుకు అసోసియేషన్ నిర్ణయించింది. అయితే, ఉస్మానియాలో నెలకొన్న పరిణామాలతో భద్రత సంస్థల ఆదేశాల మేరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పడింది.
తిరిగి బుధవారం అసోసియేషన్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. ఉస్మానియాలో కాకుండా మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ సదస్సును తరలించారు.
కాగా, ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఓయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీరి రాజీనామాపై ఇంకా స్పష్టత రానప్పటికీ విద్యార్ధులు మాత్రం పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ, రిజిస్ట్రార్, ప్రభుత్వ అసమర్ధత వల్లే మణిపూర్కు సైన్స్ కాంగ్రెస్ తరలిపోయిందంటూ విమర్శించారు.
ఇది ఇలావుంటే.. సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వేరేచోట నిర్వహించేందుకు అసోసియేషన్ ఆసక్తి చూడంతో ఆంధ్రా విశ్వవిద్యాలయంతోపాటు మరో ఏడు యూనివర్సిటీలు తమ పేర్లను ఇచ్చాయి. అయితే, ఏయూ ప్రతిపాదనను అసోసియేషన్ తిరస్కరించి, మణిపూర్కే అసోసియేషన్ మొగ్గుచూపింది.