కిడ్నాప్ చేసి మద్యం తాగించి అమ్మాయిలను వ్యభిచారంలోకి..
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో గోప్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాల గుట్టును మంగళవారం పోలీసులు రట్టు చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు గృహాలను అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని నడిపిస్తున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇతర ప్రాంతాల నుండి కిడ్నాప్ చేసి వ్యభిచార ఊబిలోకి నెట్టివేసిన ఇద్దరు బాలికలకు కూడా పోలీసులు విముక్తి కలిగించారు. డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ కృష్ణమూర్తి ఆ వివరాలను వెల్లడించారు.
జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశామని తెలిపారు. మాధవి, రాధ, వెంకటమ్మ, సుజాత, మహిమూదా, సల్మాద్ అనే మహిళలు బాలికలను ఇతర ప్రాంతాల నుండి కిడ్నాప్ చేసుకొచ్చి వారికి మాయమాటలు చెప్పి మత్తు పదార్థాలు ఇచ్చి బలవంతంగా మద్యం తాగించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని చెప్పారు.
నిరుటి నుండి ఈ వ్యవహారం కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల రూరల్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిందన్నారు. గత 4-5 రోజుల నుండి రూరల్ సిఐ శ్రీనివాస్తో పాటు పోలీసులు హౌసింగ్ బోర్డుపై నిఘా పెట్టారు. మంగళవారం తెల్లవారుజామున వ్యభిచార గృహాలపై దాడి చేశామని ఆయన వెల్లడించారు.
గృహాలపై దాడి చేయడంతో అందులో బాలికలు ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. వ్యభిచార గృహాలను నడిపిస్తున్న ఆరుగురు మహిళలను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వ్యభిచార గృహాలలో ఉన్న బాలికల్లో ఒకరిని పది రోజుల క్రితం బెంగుళూర్లో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారని తెలిపారు. మరో బాలిక బెంగుళూర్ వాసియేనని, తిరుపతికి వస్తే తిరుపతి నుండి కిడ్నాప్ చేసుకుని వచ్చారని డిఎస్పీ తెలిపారు.