కెసిఆర్కు కోదండరాం ఝలక్!: బిజెపి ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం
హైదరాబాద్: తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షకు పలు పార్టీల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రభాకర్ నాలుగు రోజులుగా సర్కిల్ కార్యాలయం వద్దే బైఠాయించారు. ఆయనకు మంగళవారం తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఖైరతాబాద్ బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సంఘీభావం ప్రకటించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె చేస్తే అన్యాయంగా కార్మికులను పనిలో నుండి తొలగించి వారి జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన ప్రజలకు ఉన్న ఉద్యోగాలు తీసేయడమేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను పనిలోకి తీసుకోవాలన్నారు.
ప్రభాకర్ నిరసన దీక్షకు మద్దతుగా మంగళవారం రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ వద్ద బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బిజెవైఎం ఉప్పల్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుండి సర్కిల్ కార్యాలయం వరకు నిర్వహించారు.
తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి, సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం నేతలు డిప్యూటి కమిషనర్ విశ్వనాధంను ఘెరావ్ చేశారు. న్యాయబద్ధంగా సమ్మె చేస్తే తొలగిస్తారా అంటూ ఆగ్రహం చేస్తూ ఒక దశలో డిసిని ఘెరావ్ చేశారు. విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.