తాకట్టు ఆస్తులు 50 కోట్లు!: ఏఎస్సై మోహన్ రెడ్డి లీలలు, బావమరిది సహా 6గురి అరెస్ట్
కరీంనగర్: కరీంనగర్లో ఏఎస్సైగా పని చేస్తూ అక్రమ వడ్డీ వ్యాపారాలు కొనసాగిస్తూ దందా నడిపిన మోహన్ రెడ్డి లీలలు ఎన్నో బయటకు వస్తున్నాయి. తాజాగా, మోహన్ రెడ్డి కేసులో సీఐడీ పోలీసులు మరో ఆరుగురిని అరెస్టు చేశారు.
శనివారం నాడు మోహన్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరుణాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, పరుశురాములు, శ్రీపాల్ రెడ్డి, కత్తి రమేష్, పర్వీందర్ సింగ్లను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సిఐడి పోలీసులు చెప్పారు.
మోహన్ రెడ్డి దందాలకు కానిస్టేబుల్ పరుశురాములు సహకరించాడని చెప్పారు. మోహన్ రెడ్డి నుంచి వడ్డీకి తీసుకున్న వారి నుంచి పరుశురాములు బెదిరించి వసూళ్లు చేసేవాడని తేలిందని తెలుస్తోంది.
వడ్డీకి తీసుకున్న వారి పైన మోహన్ తరఫు వాళ్లు బెదిరింపులకు పాల్పడేవారని సిఐడి చీఫ్ చెప్పారు. ప్రజల పైన బెదిరింపులకు పాల్పడటంతో పాటు వారి ఇళ్లను ఆక్రమించుకున్నారన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
మోహన్ రెడ్డికి కానిస్టేబుల్ పరుశురాములు పూర్తి సహకారం అందించాడని తెలిపారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, ఆస్తులు రాయించుకోవడాలు చేసేవాడన్నారు. మోహన్ రెడ్డి బావమరిది శ్రీపాల్ రెడ్డికి కూడా ఈ కేసుతో సంబంధముందని చెప్పారు. విచారణ కొనసాగుతోందని, మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
కాగా, ఏఎస్సై మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మోహన్ రెడ్డి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ విభాగం అతనికి సహకరించిన అందరి వివరాలు సేకరించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. మోహన్ రెడ్డికి తాకట్టుపెట్టిన ఆస్తుల విలువ 50 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందించిన సీఐడీ, వాటి రిజిస్ట్రేషన్లను ఆపేయాలని ఆదేశించింది. 2006లో మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68 మంది సాక్షులను సిద్ధం చేసింది.
ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో నాలుగు కేసులు మోహన్ రెడ్డివే. మోహన్ రెడ్డి కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ ఇప్పటి వరకు ఏఎస్పీ నుంచి హోంగార్డు వరకు పలువురిని సస్పెండ్ చేసింది. మోహన్ రెడ్డిపై 20కి పైగా కేసులు నమోదు చేశారు. మరో ఆరుగుర్ని కోర్టు ముందు హాజరుపరిచారు.