విద్యార్థుల్లో శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సహం: డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతోందన్నారు.
సికింద్రాబాద్, సెయింట్ పాట్రిక్ స్కూల్ లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2018 ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి ప్రారంభించారు.
సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించడానికి, సైన్స్ ఫెయిర్లు నిర్వహించడానికి నిధులు ఎక్కువగా కేటాయించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలో 544 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వీటితో పాటు 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 8 లక్షల మందికి నాణ్యమైన విద్య అందుతోందన్నారు.
విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు. విద్యావకాశాలు, వసతులు ఎలా ఉన్నా...గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని, మిస్సైల్ మ్యాన్ గా ఎదిగి, ఆ తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయిన డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం మనందరికీ స్పూర్తిదాయకమన్నారు.
దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి ఈ సైన్స్ ఫెయిర్ కు వచ్చిన విద్యార్థులు చారిత్రక హైదరాబాద్ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు చూడాలని, ఇందుకోసం విద్యాశాఖ తరపున టూర్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు.