ప్రజాప్రతినిధులను ప్రలోభ పెడుతున్నారు.!జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోండి.!ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.!
హైదరాబాద్ : వివాదాలకు దూరంగా ఉండే సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. జగ్గారెడ్డి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని, ఆయన మీద రాజ్యాంగ బద్దమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యదు చేసారు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఎంపిటిసి, జెడ్పిటిసీలను ప్రలోభ పెడుతున్నారని రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ జగ్గ్గారెడ్డి ఓటర్లకు ఫోన్లు చేసారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్సి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని వివరిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడమే కాకుండా గెలుపే లక్ష్యంగా అడ్డదారులు ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని బుద్ధభవన్ లో సీఈఓ శశాంక్ గోయల్ ని కలిసిన టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ వినతి పత్రాన్ని అందించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులకు ఓటువేసే ముందు 50వేల రూపాయలు, ఓటు వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ముట్టజెప్పేటట్టు ఒప్పందాలు చేసుకున్నారని, అందుకు ప్రజా ప్రతినిధులు కూడా అంగీకరించినట్టు ప్రసార మాధ్యమాల్లో పెయిడ్ వార్తలు రాయించుకుంటున్నారని ఘాటు విమర్శలు చేసారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ పేపర్ ప్రకటనలు చేస్తున్నారని, ఇంతటి నీచమైన రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని, ఇది కచ్చితంగా నేరమేనని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్టు టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ వెల్లడించారు. ఎస్ఈసీ సానుకూలంగా స్పందించినట్టు, విషయం పట్ల విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు.