టీఆర్ఎస్లోకి.. టిడిపిని వీడినందుకు బాధ: సాయన్న, కాంగ్రెస్లో అవమానం: ప్రభాకర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు గట్టి దెబ్బ తగిలింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్లు గురువారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం సాయన్న విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తాను టిఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. హైదరాబాద్ను విశ్వనగరంలో తీర్చిదిద్దేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
భవిష్యత్లో కంటోన్మెంట్ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. పేదల కోసం చేపట్టిన డబుల్బెడ్ రూం పథకం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. తెలుగుదేశం పార్టీలో తనను బాధించిన సందర్భాలు ఏమీ లేవని చెప్పారు. టిడిపిని వీడటం బాధగానే ఉందన్నారు.
టీడీపీలో అన్ని విధాలుగా తనకు ఎంతో ఆదరణ లభించిందని చెప్పారు. తాను టిటిడి బోర్డుకు సభ్యుడినని, టిఆర్ఎస్లో చేరుతున్నందున ఇక నుంటి టిటిడి బోర్డుకు ఎలాంటి లేఖలు రాయనని చెప్పారు. తాను తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కారు ఎక్కుతున్నానని చెప్పారు. ఆర్మీ రోడ్డు తెరిపించడంలో కెసిఆర్ది కీలక పాత్ర అన్నారు. బంగారు తెలంగాణలో భాగస్వామిని అవుతానని చెప్పారు.
నాకు అవమానం జరిగింది: ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీలో తనకు అవామనం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని హైకమాండ్ సహా రాష్ట్ర నాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇది తనకు, కార్యకర్తలకు ఇబ్బందేనని గుర్తించానని చెప్పారు. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.