వాదన ఏదైనా..: బాబు-కేసీఆర్ల ఆత్మీయ పలకరింపు, ఆసక్తిగా చూశారు
న్యూఢిల్లీ: అపెక్స్ కౌన్సెల్ సమావేశంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ)లు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇద్దరు చంద్రులు మాట్లాడుకుంటున్న సమయంలో అందరు వీరినే గమనించారు.
రాష్ట్ర విభజన, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఇరువురు సీఎంలు కలిసి మాట్లాడుకున్న సమయంలో అందరు ఆశక్తిగా గమనించారని అంటున్నారు.
కేసీఆర్, చంద్రబాబు.. ఇద్దరి మొహంలోను సంతోషం కనిపించింది. ఒకరినొకరు చూసి చిరునవ్వులు చిందించారు. వారి తీరు సమస్యల పైన సానుకూలంగా ముందుకెళ్దామనే భావన కనిపించిందని అంటున్నారు. ఇదే ధోరణితో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చునని అంటున్నారు.
వాటిపై ఎవరి వాదన వారిదే అయినా..
అపెక్స్ సమావేశంలో రెండు అంశాల పైన ఏకాభిప్రాయం రాలేదు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై ఎవరి వాదనలు వారు వినిపించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తామని, నిలిపేసే ప్రసక్తేలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేసిన తర్వాత ఎవరికి కావలసిన ప్రాజెక్టులు వారు కట్టుకోవచ్చని, రాయలసీమ నుంచి మాకూ డిమాండ్లు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మరో కీలక అంశం గోదావరి నుంచి కృష్ణా బేసిన్లోకి మళ్లించే నీటిలో వాటాపై కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకొంటారు. దీనిపై మూడునెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం కోరింది.
విభజన చట్టం మేరకు కృష్ణాజలాలపై కేంద్రజలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షురాలిగా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషిలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్ కుమార్లు పలు సందర్భాల్లో చర్చల్లో పాల్గొన్నారు.
అజెండాలోని మూడు అంశాలకు సమావేశంలో అంగీకరించారు. నీటిని తీసుకొనే రెగ్యులేటర్ల వద్ద నీటిని లెక్కగట్టేందుకు టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు, రెండు రాష్ట్రాల అధికారుల సంయుక్త పర్యవేక్షణ, నిర్ణయించిన మేరకు నీటి వినియోగానికి రెండు రాష్ట్రాల ఇఎన్సీలు, బోర్డు సభ్యకార్యదర్శితో కమిటీ ఏర్పాటుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది.
దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో నీటిని తీసుకొనే తూముల వద్ద, తెలంగాణలో నీటిని తీసుకొనే తూముల వద్ద రెండు రాష్ట్రాల ఇంజినీర్లు ఉండి సంయుక్తంగా తీసుకొన్న నీటిని ధ్రువీకరిస్తారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కూడా సమావేశం నిర్ణయించింది. తరచూ సమావేశమై నిర్ణయాలు తీసుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఇరువురు సీఎంలు అభిప్రాయపడ్డారు.