రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కపట ప్రేమ.!టీఆర్ఎస్ నిరసనలపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్.!
హైదరాబాద్ : రైతాంగం పట్ల బీజేపి, టీఆర్ఎస్ రెండూ పార్టీలు మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాయని, దొంగ ప్రేమ వలకబోస్తూ టీఆర్ఎస్ పార్టీ దొంగ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. వరిధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పిన వెంటనే అందుకు సంబంధించిన పత్రాల మీద ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతకం చేసారని గుర్తు చేసారు. కేంద్ర బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికార ఒప్పందంతో పనిచేస్తూ రైతులను మభ్యపెడుతున్నాయని రెండు పార్టీలపైన సీతక్క విరుచుకుపడ్డారు.
రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధ్వజమెత్తిన సీతక్క
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో గత ఏడాదిగా ఢిల్లీలో ఏడు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు. నల్ల చట్టాలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఇప్పుడు రైతులు గుర్తుకొస్తున్నరా అని సీతక్క సూటిగా ప్రశ్నించారు. ధర్నాచౌక్ ఎత్తివేసిన చంద్రశేఖర్ రావుకు ఇప్పుడు అదే ధర్నాచౌక్ గతి అయ్యిందని ఎద్దేవా చేపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుది గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీ అన్నట్టు ఉంటుందని మండిపడ్డారు.
రైతులకు పచ్చి అబద్దాలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు దొంగ ప్రేమ వలకబోస్తున్నారన్న ములుగు ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన చంద్రశేఖర్ రావు, తర్వాత మాట మార్చారని సీతక్క ధ్వజమెత్తారు. రైతులను నిండా మోసం చేసింది చాలక ఇప్పుడు రైతుల పక్షాన ఎలా నిరసనలు చేస్తారని ప్రశ్నించారు. ఇదే రైతుల పక్షాన తాము ప్రతి పక్ష పార్టీగా పోరాటం చేస్తే అక్రమ అరెస్ట్ లు, గృహ నిర్భందాలు చేస్తారని, అదే అధికార పార్టీ నాయకులు ధర్నా చేస్తే పోలీసులు దగ్గరుండి స్థలాలు పరిశీలిస్తున్నారని మండి పడ్డారు. వరి అంటే ఉరి అని బీజేపి, టీఆర్ఎస్ నేతలు ఒకరి మీద ఒకరు నాటకాలు అడతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీతక్క.
వరి దాన్యం విషయంలో మోసం.. రైతులను బీజేపి. టీఆర్ఎస్ మభ్యపెడుతున్నాయన్న అనసూయ
కేద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి అంటే ఉరి అని రైతులను బాయబ్రంతులకు గురి చేస్తూ వీధి నాటకాలు ఆడుతున్న పరిస్థితి తలెత్తిందని, రైతు వ్యతిరేకత కూడగట్టుకుంటున్న మూడు నల్ల చట్టాలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు రైతులు పండించిన పంట కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని కొత్త నాటకానికి తెర తీసి రైతులను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రశేఖర్ రావుకు ప్రజలే బుద్ది చెపుతారని, ఏడాది కాలంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే చంద్రవేఖర్ రావు కనీసం వాళ్లకు మద్దతుగా నిలువలేదని తీవ్ర స్థాయిలో సీతక్క విమర్శించారు.
పోలీసులు వ్యవస్ధలను నమ్మాలి..వ్యక్తులను కాదన్న ములుగు ఎమ్మెల్యే
అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి రాష్ట్ర పోలీసులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదన్న అంశాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులను సీతక్క హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉండవు, రాస్తో రోకో లు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు తానే ప్రత్యక్షంగా ధర్నాకు దిగిన పరిస్థితి తలెత్తిందని సీతక్క పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఎరువులు అందిస్తానని తప్పుడు వాగ్దానం చేసారని గుర్తు చేసారు. క్రాఫ్ లోన్ పైన వడ్డీ రాయితీ ఇస్దానని, రైతుల లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తానని చెప్పిన మాట కూడా సీఎం తప్పారని సీతక్క అన్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ, కేంద్రంలో కమలం పార్టీ ఓపక్క రైతులను మోసం చేస్తూనే మరోపక్క కపట ప్రేమ చూపిస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు సీతక్క.