మూడోస్సారి: తెలంగాణలో ఆర్టీసీ బాదుడు, ఈసారీ డీజిల్ సెస్, నేటి రాత్రి నుంచే, సిటీకి ఊరట
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మరోసారి టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచి. టీఎస్ఆర్టీసీ.. మరోసారి ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంచింది. కిలోమీటర్ వారీగా డీజిల్ సెస్ విధించేందుకు టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఈసారీ డీజిల్ సెస్
డీజిల్ సెస్ భారం వల్ల ఛార్జీల పెంచేందుకు సిద్ధమైనట్లు చెబుతోంది. అయితే, ఛార్జీల పెంపు నుంచి జీహెచ్ఎంసీని మినహాయించింది.తక్కువ దూరం ప్రయాణికులపై భారం పడకుండా స్లాబ్లు తీసుకొచ్చింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనీసం రూ.5గా నిర్ణయించింది. 250 కిలోమీటర్ల దూరం వరకు పల్లె వెలుగులో రూ.45, ఎక్స్ప్రెస్లో 500 కిలోమీటర్ల వరకు రూ.90, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.125 డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు.
దూరాన్ని బట్టి ఛార్జీలను పెంచిన ఆర్టీసీ
ఇక, సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస దూరానికి రూ.10లు, 500 కిలోమీటర్ల వరకు రూ.130 డీజిల్ సెస్ రూపంలో వసూలు చేయనున్నారు. ఏసీ సర్వీసుల్లో కనీస దూరానికి రూ.10, 500 కిలోమీటర్ల వరకు రూ.170 డీజిల్ సెస్ రూపంలో వసూలు చేయనున్నారు. కనిష్ఠ, గరిష్ఠ దూరాన్ని బట్టి టికెట్లపై ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనుంది.
నేటి రాత్రి నుంచే అమల్లోకి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు
ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన డీజిల్ సెస్ నేటి అర్థరాత్రి నుంచి(గురువారం-జూన్ 9) అమలు చేయనున్నారు.గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన విషయం తెలిసిందే. అంతేగాక, గతంలో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచింది. తాజాగా, పెంపుతో ప్రజలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ మరింత భారం మోపిందని ప్రజలు మండిపడుతున్నారు.