వికృత చేష్టలు: బాధితులు ఎక్కువగా మహిళలే, మరో ముగ్గురు మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో కల్తీకల్లుకు బానిసైనవారు ఆ మందు కల్లు దొరకకపోవడంతో చాలా మంది కల్తీకల్లు బాధితులు మంచం పట్టారు. దానికి తోడు మంచం పట్టిన కల్తీకల్లు బాధితులు పలువురు మృత్యువాత పడుతున్నారు. గత రెండురోజుల వ్యవధిలోనే మహబూబ్నగర్ జిల్లాలో మృతుల సంఖ్య పదికి చేరింది.
ఇప్పటికే జిల్లాలో నారాయణపేట, కొడంగల్, మక్త ల్, జడ్చర్ల, షాద్నగర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా వందలకు పెరుగుతోంది. మృతుల సంఖ్య పదికి చేరింది. సోమవారం జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ 50), జడ్చర్ల పట్టణానికి చెందిన లక్ష్మమ్మ (60) మృత్యువాత పడ్డారు.
కొడంగల్ నియోజకవర్గంలోని బోంరాస్పేట మండలం ఎనే్కపల్లి గ్రామానికి చెందిన జోగు మణెమ్మ (60) మృతి చెందింది. ఈమె గత వారం రోజుల నుండి మందు కల్లు దొరకక పిచ్చిచేష్టలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ గ్రామంలో మరికొంతమంది పిచ్చిచేష్టలు చేస్తూ ఆసుపత్రి పాలయ్యారు.
కల్లులో మత్తులేక దానికి బానిసైన వారు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు ఎక్కువ శాతం పేద మహిళలే కావడం గమనార్హం. జిల్లాలో తరుచూ ఎక్సైజ్ దాడులు కొనసాగుతుండడంతో దాదాపు కల్తీకల్లు విక్రయాలు చేస్తున్న దాదాపు 400లకు పైగా కల్తీకల్లు దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ పరంగా జిల్లాలో 1990 దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయి.
మరో 2430 దుకాణాలు కృత్రిమ కల్లు తయారుచేసి విక్రయిస్తున్నాయ. డైజోఫాం, క్లోరో ఫాం, ఆల్ఫాజోడం, రసాయనిక మందులు వేసి కల్తీకల్లు తయారుచేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు జిల్లాలో కల్తీకల్లు దుకాణాలపై ముమ్మరంగా దాడులుచేస్తూ సోమవారం నాటికి దాదాపు 394 కేసులు నమోదు చేశారు.