తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, తల్లి మందలించిందని ఒకరు
తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒకటి రెండు రోజుల్లోనే నలుగురు విద్యార్థుల మృతి కలకలం రేపుతోంది.
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒకటి రెండు రోజుల్లోనే నలుగురు విద్యార్థుల మృతి కలకలం రేపుతోంది.
నా జీవితం దుర్భరంగా మారింది: బిటెక్ అమ్మాయి మౌనిక ఆత్మహత్య
నలుగురు విద్యార్థులు కూడా ప్రొఫెషనల్ కోర్స్ విద్యార్థులే. చదువుల ఒత్తిడా? కాలేజీల వేధింపులా? తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఇబ్బందులా? వారు ఇలా ఎందుకు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్లో మౌనిక
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం కాలనీలో మౌనిక (21) అనే బిటెక్ ఫోర్త్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ఇన్స్టాగ్రామ్లో తన ఆవేదనను వెళ్లగక్కుతూ పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ప్రతి నిమిషం వరస్ట్గా ఉందని పేర్కొంది. కాగా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో స్నేహితులతో చాటింగ్ చేస్తోందంటూ పేరెంట్స్ మందలించడం వల్లే మనస్తాపానికి గురై ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో
మౌనిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మౌనికను స్థానిక నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఇన్స్టాగ్రామ్లో చనిపోతున్నట్లు పోస్టును గుర్తించారు.
ఎంసెట్ కోచింగ్ సెంటర్లో విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఎంసెట్ కోచింగ్ సెంటర్లో లాంగ్ టర్మ కోచింగ్ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఆమె సూసైడ్ నోట్ రాసింది. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నట్లు పేర్కొంది. సంయుక్త నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రాంపల్లి గ్రామానికి చెందిన రాజెందర్ కూతురు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.
ట్రిపుల్ ఐటీలో మూర్తి ఆత్మహత్య
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న మూర్తి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి. తోటి విద్యార్థులు అతనిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
బాలకృష్ణ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లాలో తిరుపతిలో బాలకృష్ణ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. లెక్చరర్ వేధింపులు తాళలేక అతను ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.