ఇద్దరు చంద్రులు కేంద్రంపై ఒత్తిడి తెస్తారా?: జీఎస్టీ భారం తగ్గిస్తారా?
రెండు రాష్ట్రాల్లోనూ రమారమీ రెండు లక్షల చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరమగ్గాల పుణ్యమా? అని చేనేత రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వేళ.. సోమవారం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు.
హైదరాబాద్/ అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు ప్రభావం ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నది. ప్రజల ప్రయోజనాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణలో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై జీఎస్టీ విధించరాదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను తోసి రాజన్నది కేంద్రం.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులపై జీఎస్టీ భారం వేస్తే ఎలాగని, దీనిపై న్యాయస్థానం మెట్లెక్కుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నినదించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి విజయం సాధించి 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాదినేత చంద్రబాబు.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ పక్కకు తప్పించినా ఏమీ అనలేకపోయారు.
రెండు రాష్ట్రాల్లోనూ రమారమీ రెండు లక్షల చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరమగ్గాల పుణ్యమా? అని చేనేత రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వేళ.. సోమవారం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ జీఎస్టీ అమలు చేయడం వల్ల చేనేత రంగంపై మూలిగే నక్కపై తాటిపండు ఊడిపడినట్లయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు, వస్త్ర పరిశ్రమకు శాపంగా మారిన జీఎస్టీ ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.
ముద్ర రుణాల మంజూరునకు బ్యాంకుల నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ రుణ మాఫీ అమలు చేసి.. క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేసినా ‘ముద్ర' రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ‘ససేమిరా' అంటున్నాయి. మరోవైపు కస్లర్లలో నేసిన వస్త్రాలకు మార్కెట్ కరువైంది. గిట్టుబాటు ధర లభించక చౌక ధరలకే చేనేత వస్త్రాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. జీఎస్టీతో మరింత కుదేలై పోయింది చేనేత వర్గం. తమకు సౌకర్యాలు కల్పించకుండా పండుగలేమిటని చేనేత కార్మికులు ఆగ్రహిస్తున్నారు. హ్యాండ్లూమ్ బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని చేనేత కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఆదాయం సరిపోక బలవన్మరణాలు ఇలా
దేశంలో చేనేత రంగం కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చాలీచాలని ఆదాయంతో ఈ వృత్తిలో కొనసాగలేక మరో మార్గం కనిపించక చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో తలసరి ఆదాయం రూ.1.25 లక్షల నుంచి రూ.1.30లక్షల వరకూ చేరింది. కానీ, చేనేత కార్మికుడి ఆదాయం మాత్రం అందులో నాలుగో వంతే మరి. చేనేత కార్మికుడి ఏడాది ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.31 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.29 వేలు మాత్రమే. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికుల ఆదాయం పెంచే విధాన నిర్ణయాలు తీసుకోకుండా, జీఎస్టీ భారం మోపి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు పండుగలు నిర్వహిస్తామని అనడం విడ్డూరంగా ఉందని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర సవతి ప్రేమపై ఇలా వ్యతిరేకత
ప్రతియేటా ఆగస్టు 7న అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వేడుకలు, సదస్సులను నేత కార్మికులు బహిష్కరిస్తున్నట్లు జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడు కేఏఎన్ మూర్తి తెలిపారు. వృత్తి పని కోసం క్లస్టర్లు, కష్టపడి నేసిన వస్త్రానికి మార్కెటింగ్ కల్పించాలని ఎన్ని సార్లు కోరినా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాలు చేనేత పండుగలు నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. కనీసం మగ్గాలు కొనుగోలుకు రుణాలు కూడా అందించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 7న మాత్రమే చేనేత రంగం ఒకటి ఉన్నదని గుర్తుకురావడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సవతి తల్లి ప్రేమను నిరసిస్తూ చేనేత సంఘాల నేతలు, హ్యాండ్లూబ్ బోర్డు సభ్యులు సోమవారంకార్యక్రమాలను బహిష్కస్తున్నట్లు కేఏఎన్ మూర్తి తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాది కల్పిస్తున్న చేనేత రంగం కొన్నేళ్లుగా కునారిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో 1.75 లక్షల చేనేత మగ్గాలుండగా, తెలంగాణలో 35 వేల వరకూ ఉన్నాయి. అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో దేశంలో ఏ జిల్లాలో లేనంత అత్యధికంగా 78 వేల మగ్గాలు ఉన్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ చేనేత అధిక సంఖ్యలో మగ్గాలు ఉన్నాయి.
ప్రతిపాదనలు పంపనందుకే కేంద్రం నిధుల్లో కోత
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.110 కోట్లు రుణమాఫీ చేసి బలవన్మరణాలకు అడ్డుకట్ట వేసింది. దీంతో తమ బతుకు తాము బతుకుతామని, వృత్తి పని చేసుకోవడానికి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. రాష్ట్రంలో కనీసం 100కు పైగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తేనే కార్మికులకు ఇబ్బందులు తొలగుతాయి. కానీ రాష్ట్ర అధికారులు సకాలంలో ప్రతిపాదనలు పంపలేదని.. కేంద్రం కేవలం 11 క్లస్టర్లు మాత్రమే 2016-17 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేసింది. ఇక చేనేత కార్మికుడికి ప్రధాన జీవనాధారమైన మగ్గాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలంటే రూ.1 లక్ష వరకు అవసరం. వర్కింగ్ కేపిటల్ చేర్చితే రూ.2 లక్షల వరకూ కావాలి.
చేనేతకు ప్రధాన సమస్య మార్కెటింగ్
ప్రధానమంత్రి ‘ముద్ర' లోన్లు ఏటా 6శాతం వడ్డీతో రూ.2లక్షల వరకూ ఇస్తామని కేంద్రం ప్రకటించినా బ్యాంకర్లు మాత్రం ఇవ్వడంలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న అందుబాటులో సమాచారం మేరకు 14.5 శాతం లోన్లు మాత్రమే బ్యాంకర్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీకి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్ (నో డ్యూ) ఇస్తేనే రుణాలిస్తామని చెబుతున్నారు. దాని కోసం ప్రయత్నిస్తే ప్రభుత్వం అసలు మాత్రమే చెల్లించిందని, వడ్డీ ఇంకా బ్యాంకుల్లో పూర్తిగా జమకాలేదని సమాధానం వస్తోంది. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎక్కడా సాధ్యం కావడంలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో రూ.3500 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు తయారవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో ఆప్కో ద్వారా విక్రయిస్తుది ఏటా రూ.300 కోట్లే విలువైన వస్త్రాలే. కో ఆపరేటివ్ సొసైటీల నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రమే ఆప్కో కొనుగోలు చేస్తుంది. మార్కెట్లో ఉత్పత్తయ్యే మొత్తం వస్త్రాల్లో ఆప్కో కొనుగోలు కేవలం 9శాతం మాత్రమే. మిగిలిన 91శాతం ఎక్కడ విక్రయించాలనేది కార్మికులకే దిక్కుతోచడంలేదు. ఫలితంగా ఆదాయం రాక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకిచ్చే యూనిఫామ్, ఇతర అవసరాలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని అడిగినా ఫలితం లేదు. కమీషన్ల కోసం ఆశపడి పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. చేనేత మగ్గాలపై వస్త్ర ఉత్పత్తి ఆలస్యమే ఇందుకు కారణమని చెబుతున్నారు. చేనేత బజార్లు ఏర్పాటు, ఆన్లైన్ ట్రేడింగ్తో ఒప్పందం అని చేనేత జౌళిశాఖ చెబుతున్నా అవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలోకి రావడంలేదు.
చేనేత కార్మికుల వినతులు పట్టని కేంద్రం
జాతీయ స్థాయిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఉన్నా కేవలం నూలు మాత్రమే అందిస్తోంది తప్ప మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం లేదు. దీన్ని నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్పమెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్గా మార్చి రూ.5వేల కోట్లు నిధులు కేటాయించాలని హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుల బృందం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఫలితం కనిపించడంలేదు. రాష్ట్ర స్థాయిలో ఏపీ హ్యాండ్లూమ్స్ ఫైనాన్స్ అండ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ కావాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. ఇతర కార్పొరేషన్లకు ఇచ్చిన విధంగా నిధులు కేటాయించి సహకార రంగంతోపాటు అందులో లేని కార్మికులకు కూడా మూలధనం ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. ‘ఆ డబ్బు తిరిగి సరిగా చెల్లించరని అనుమానం ఉంటే పదిమంది సభ్యులకు దాటకుండా హ్యాండ్లూమ్ వీవర్స్ గ్రూప్లు ఏర్పాటు చేసి గ్రూపునకు లోన్లు ఇవ్వాలి. ఏ ఒక్కరు చెల్లించకున్నా మిగతా తొమ్మిది మంది బాధ్యత తీసుకునేలా రుణం ఇచ్చేముందు ఒప్పందం చేసుకున్నా సమ్మతమే' అని కార్మికులు చెబుతున్నారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 100 నుంచి 200 సంఘాలు ఏర్పాటు చేసి లోన్లు ఇస్తే చేనేత బతుకులు కొంతైనా మెరుగు పడతాయని నేతన్నలు అంటున్నారు.
ప్రతిదానికి జీఎస్టీ విధింపు దారుణం
చిలప నూలుతోపాటు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని చేనేత కార్మికులు, సంఘాల నేతలు హ్యాండ్లూమ్ బోర్డు సభ్యులు ముక్త కంఠంతో కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చేనేత సంఘాల నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చేనేతపై పన్నులేదని, మహాత్మా గాంధీ రాట్నం వడికే ఫోటో ఆఫీసులో పెట్టుకొనే కేంద్ర పాలకులు చిలపనూలుపై ఐదుశాతం పన్ను విధించడం బాధాకరమని చేనేత కార్మికులు వాపోతున్నారు. ఇక తెలంగాణలో వరంగల్ కేంద్రంగా చేనేత టెక్స్ టైల్స్ పార్క్ నిర్మిస్తామని ఊరిస్తున్నది. దాని సంగతేమిటో గానీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చేనేత ముడిసరుకు, ఉత్పత్తులపై జీఎస్టీ లేకుండా చూడాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.