సెటిలర్లకు కెసిఆర్ గాలం: జిహెచ్ఎంసి ఎన్నికల్లో సీమాంధ్రులకు టికెట్లు
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో సెటిలర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా విజయం సాధించాలనే పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నారనేది స్పష్టంగానే అర్థమవుతోంది. గత కొంత కాలంగా ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మాట్లాడుతున్న తీరు అందుకు అద్దం పడుతోంది.
సెటిలర్లకు గాలం వేయడానికి కెసిఆర్ మరో వ్యూహరచన కూడా చేసినట్లు కనిపిస్తున్నారు. గత 15 ఏళ్ల టిఆర్ఎస్ చరిత్రలో సెటిలర్లను ఎన్నికల్లో నిలబెట్టిన దాఖలాలు లేవు. తొలిసారి హైదరాబాదు ఎన్నికల్లో పది నుంచి 12 మంది సెటిలర్లను పోటీకి దింపాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ దాదాపు 140 మంది సీమాంధ్ర సెటిలర్లు దరఖాస్తులు పెట్టుకున్నట్లు సమాచారం. సీమాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న డివిజన్లలో వారిని పోటీకి దింపాలని కెసిఆర్ భావిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో కూడా గతంలో టిఆర్ఎస్ సీమాంధ్రులకు టికెట్లు ఇవ్వలేదు. టిడిపి, కాంగ్రెసు పార్టీలు మాత్రం అటువంటి విధానాన్ని పాటించలేదు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి బల్దియాపై గులాబీ జెండా ఎగురేయాలనే పట్టుదలతో టిఆర్ఎస్ నాయకత్వం ఉంది. అందుకే సెటిలర్లను కూడా తమ పరిధిలోకి తెచ్చుకుంటోంది.