కృష్ణమ్మ నీళ్లతో ప్రజల కాళ్లు కడుగుతా: తుమ్మల హామీ
ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో భక్తరామదాసు ప్రాజెక్టును రూ.100 కోట్లతో నిర్మిస్తున్నామని, ఆ ప్రాజెక్టుతో మరో మూడు నెలల్లో కృష్ణమ్మ నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానని ఆయన హామీ ఇచ్చారు.
అరవై ఏండ్లుగా వెనుకబాటుకు గురై శాశ్వత కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గం అభివృద్ధితో బంగారు తెలంగాణకు బాటలేద్దామని, ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న స్వరాజ్యానికి వారధులవుదామని ఆయన అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ మాధవీరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ గ్రామానికి చెందిన తొమ్మిది మంది వార్డు సభ్యులు, 300 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. తలాపునే సముద్రంలాంటి పాలేరు జలాశయం ఉన్నప్పటికీ పాలకుల వైఫల్యంతో నియోజకవర్గం ఏడారిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
పాలేరు ప్రజలందరూ సమిష్టిగా రాబోయే ఉప ఎన్నికలో అఖండ మెజారిటీతో విజయాన్ని అందించాలని, అలా చేస్తే పాలేరు ప్రజలకు పెద్ద పాలేరుగా మూడేండ్లు పని చేస్తానని చెప్పారు. ప్రజలందరూ ఆశీర్వదిస్తే రాబోయే మూడేళ్లలో యావత్తు దేశం ఆసూయ పడేలా పాలేరు అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, చేయకపోతే మూడేండ్లు దాటిన మరసటి రోజు నుంచి పాలేరు ప్రజలకే కాకుండా ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖం చూపించబోనని శపథం చేశారు.
కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్ గడిపల్లి కవిత, ఖమ్మం మేయర్ పాపాలాల్ తదితరులున్నారు.