ఒళ్లుబలిసి, అడ్డగోలుగా, తీస్మార్ ఖాన్.. ఫెడరల్ ఫ్రెంటా?: కేసీఆర్పై ఉత్తమ్ నిప్పులు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన విమర్శలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్దేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వందలకోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకున్నారని ఆరోపించారు. రూ.500కోట్ల విలువైన భూమిలో ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్ కట్టించావు అని ప్రశ్నించారు. ప్రగతి భవన్లోకి రైతులకు, సామాన్యులు వెళ్లరని, ఏపీ వ్యాపారులు, కాంట్రాక్టర్లే వెళతారని అన్నారు.
ప్రధాని ఇల్లు కూడా.
ప్రధాని ఇల్లు కూడా ప్రగతి భవన్ అంత విలాసవంతంగా ఉండదని ఉత్తమ్ అన్నారు. లక్ష స్క్వేర్ ఫీట్ల భూమిలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఉండటం లేదని అన్నారు.
ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని తాను ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. రూ. కోట్ల రూపాయలతో లగ్జరీ కార్లు ప్రజాసొమ్ముతో కొనుగోలు చేసి వాడుతున్నారని కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు.
కేసీఆర్లా కాదు..
తాను 16ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు లెక్క చేయకుండా సైన్యం చేరినట్లు ఉత్తమ్ తెలిపారు. నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. తమ కుటుంబం ప్రజా సేవకు అంకితమైందని అన్నారు. కేసీఆర్ లా మోసాలు చేసే తెలివితేటలు తనకు లేవని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణను దోపిడీ చేస్తున్నారు..
కేసీఆర్ లాగా తాను క్యారెక్టర్లెస్ పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదని ఉత్తమ్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ తన వ్యక్తిగత పర్యటనలకు కూడా ప్రజా సొమ్మును ఖర్చు చేస్తూ ప్రైవేటు జెట్లు వాడుతన్నారని మండిపడ్డారు. కోల్కతా, చైనాలతోపాటు ఇతర పర్యటనలకు వెళితే ప్రైవేటు జెట్లు వాడారని అన్నారు.
తెలంగాణను సర్వనాశనం చేశారు
రాష్ట్రంలో చనిపోయిన రైతులకు ఆర్థిక చేసేందుకు మాత్రం కేసీఆర్ ముందు రావడం లేదని అన్నారు. అమరవీరులను ఆదుకునేందుకు, ఫీజు రీఎంబర్స్మెంట్కు,
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు లేవంటున్నారని సీఎంపై ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్దేనని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిగ్గుశరం ఉందా? ఒళ్లుబలిసి
ఈ నాలుగేళ్లలో సుమారు 6లక్షల75వేల కోట్ల బడ్జెట్ దుర్వినియోగం చేశారని కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తారు. అంతేగాక, రూ. 2లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. తెలంగాణను ఆంధ్రులకు తాకట్టు పెట్టింది తాము కాదని, కేసీఆరేనని అన్నారు. కేసీఆర్కు సిగ్గుశరం ఉందా? ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అమెరికాలో ఏం చేశారో అందరికీ తెలుసని అన్నారు.
తీస్మార్ ఖాన్.. ఫెడరల్ ఫ్రెంటా?
తెలంగాణ ప్రజలకు చేసిందేం లేదు గానీ.. ఫెడరల్ ఫ్రంట్ అట అంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై ఉత్తమ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదని అనడం సరికాదన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరగలేదట.. ఇప్పుడు తీస్మార్ ఖాన్ వచ్చి ఏదో చేస్తాడట అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు. చైనాతో భారత్ను పోల్చలేమని, అక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు ఏం చేశారు?
ప్లీనరీలో కేసీఆర్ అడ్డగోలుగా మాట్లతాడి చప్పట్లు కొట్టించుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. తెలంగాణలోనే ఎంపీ సీట్లు రావు కానీ.. ఇక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉద్ధరించింది ఏమీ లేదు గానీ.. దేశానికి ఏదో చేస్తాడటన అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని.. ఇదే ఆయన పాలనకు నిదర్శనమని అన్నారు.
దేశానికి ఆదర్శమా?
కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకున్నామని ఉత్తమ అన్నారు. కేసీఆర్ది అమానవీయ ప్రభుత్వమని, చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం కూడా అందించలేదని, పరామర్శ కూడా చేయలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఫెయిలైందని అన్నారు. మద్దతు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా.. ప్రభుత్వం నుంచి సాయమందలేదని, కనీసం బాధిత రైతు కుటుంబానికి పరామర్శ కూడా లభించలేదని అన్నారు. ఇలాంటి కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శమని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు.