ఆర్కే క్షేమంగా ఉన్నారు: వరవరరావు ట్విస్ట్, 20 ఏళ్లుగా ఇదే మైండ్గేమ్: డిజిపి తీవ్ర స్పందన
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారని విరసం నేత వరవర రావు గురువారం నాడు చెప్పారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఓ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో పలువురు నక్సలైట్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కే పోలీసుల కస్టడీలోనే ఉన్నారని ఇన్నాళ్లు ఆరోపించారు. ఇప్పుడు వరవర రావు ప్రకటనతో ఉత్కంఠకు తెరపడింది.
వరవర రావు ఇంకా మాట్లాడుతూ.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ)లో కూంబింగ్ ఆపేయాలని డిమాండ్ చేసారు. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆదివాసులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు.
డిజిపి తీవ్ర స్పందన
ఆర్కే క్షేమంగా ఉన్నాడని వరవర రావు ప్రకటించిన నేపథ్యంలో ఏపీ డీజీపీ సాంబశివ రావు స్పందించారు. తాము ఊహించిందే జరిగిందని, వాళ్లు మైండ్ గేమ్ ఆడారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాము జాతీయస్థాయిలో లేవనెత్తుతామని చెప్పారు. గత ఇరవై ఏల్లుగా వారు ఇదే విధానం కొనసాగిస్తున్నారన్నారు.
కాగా, ఏవోబీలో దాదాపు పది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది వరకు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ సమయంలోనే ఆర్కేను పోలీసులు పట్టుకున్నారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి.
ఆర్కే.. పోలీసుల వద్దే ఉన్నాడని, ఆయనను విడుదల చేయాలని ఆయన భార్య శిరీషా కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి.. సామాన్యులైనా, మావోయిస్టులైనా పోలీసులు రక్షించాలని, ఆర్కే చనిపోయాడా, బతికే ఉన్నాడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో, ఆర్కే గురించి తెలియదని చెబుతూ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి వివరాలు కోర్టుకు అప్పగించారు. తాజాగా, ఆర్కే క్షేమం అని ప్రకటించారు.