బాధల్లో ఉన్న యువతులు.. అతడికి బంగారు బాతుగుడ్లు: స్వచ్ఛంద సంస్థల ముసుగులో బ్లాక్ మెయిలింగ్
ఇన్స్యూరెన్స్, ఫైనాన్స్ పేరిట ఎంతోమందిని బురిడీ కొట్టించిన విక్టర్ అనే మోసగాడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నోరు విప్పడంతో అతడి దురాగతాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: బాధల్లో ఉన్నవారు ఓదార్పు, సహాయం కోరుకుంటారు. అది సహజం. అందులోనూ బాధితులు మహిళలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. పలకరించిన ప్రతి మనిషిని నమ్మేస్తారు. సరిగ్గా దీనినే తనకు అవకాశంగా మలుచుకున్నాడో ప్రబుద్ధుడు. సాయం కోసం తనను సంప్రదించిన దాదాపు 300 మంది మహిళలను ఆదుకోవాల్సింది పోయి, నానా రకాలుగా వేధించాడు.
అతడి పేరు విక్టర్ ఇమ్మాన్యుయేల్ చంద్రకాంత్. చెన్నైకి చెందినవాడైనా హైదరాబాద్ లోని బేగంపేటలో కొంతకాలం ఉన్నాడు. 2006లోనే వివాహం చేసుకుని రెండు నెలలకే భార్యను వదిలేశాడు. అప్పట్లో ప్రగతి యూత్ సొసైటీ, ఉమెన్స్ ఇష్యూస్ ప్రొటెక్షన్ ఎన్ ఫోర్స్ మెంట్ ( వైప్) పేరుతో రెండు స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహించాడు.
ముఖ్యంగా గృహహింస బాధిత యువతులు ఇతడికి బంగారు బాతుగుడ్లు. తన కౌన్సిలింగ్ సెంటర్ కు వస్తే పరిష్కారం చూపిస్తానంటూ ప్రకటనలు గుప్పించేవాడు. వాటిని నమ్మిన చాలామంది మహిళలు అతడు తమ జీవితాలను బాగుచేస్తాడని భావించి పిలిచిన చోటికి వెళ్ళేవారు.
అలా వివిధ సమస్యలతో వచ్చిన మహిళలను ఓదార్చుతూ మాట్లాడేవాడు. అతడి కల్లిబొల్లి కబుర్లు, హామీలు నమ్మి ఎంతోమంది బాధిత మహిళలు అతడికి తమ కుటుంబ పరిస్థితులు , వ్యక్తిగత రహస్యాలు తెలిపేవారు.
ఇక అవే అతడికి ఆయుధాలుగా మారేవి. నమ్మి వచ్చిన వారిని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకునేవాడు. ఇలా దాదాపు 300 మంది యువతులను అతడు మోసగించాడు. ఇతడి వేధింపులు తాళలేని కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో విక్టర్ గుట్టు రట్టయింది.
ఎలాగంటే
...
విక్టర్ తన స్వచ్ఛంద సంస్థల ద్వారా హైదరాబాద్ నగరంలోని అనేక మందితో పరిచయాలు పెంచుకున్నాడు. తన వద్దకు వచ్చేవారికి తానొక బడా ఫైనాన్షియర్ గా, మరికొందరికి ఓ పెద్ద కంపెనీకి ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా ఇలా రకరకాలుగా పరిచయం చేసుకునే వాడు.
ఓ వ్యక్తికి భారీ మొత్తంలో రుణం ఇప్పిస్తానని చెప్పి ముంబై వరకూ తీసుకెళ్ళాడు. అక్కడ తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి కార్యాలయంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి.. తాను లోపలికెళ్ళి వెళ్లి మాట్లాడి ' అంతా ఓకే అయింది.. ముందుగా కొంత డబ్బు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలంటూ చెప్పి అతడి నుంచి రూ.20 లక్షలు తీసుకుని తర్వాత పత్తా లేకుండా పోయాడు.
ఈ రకంగా విక్టర్ చేతుల్లో ఎంతోమంది మోసపోయినప్పటికీ, అతడి ఆచూకీ దొరక్కపోవడంతో బాధితులు పోలీసుల వరకు వెళ్ళలేదు. ఇలాగే నగరానికి చెందిన మీర్జా ఖయ్యూం బేగ్ అనే మరో వ్యక్తి కూడా విక్టర్ బుట్టలో పడ్డాడు.
తనకు అనేక ఐటి కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ మేనేజర్లతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మించాడు. ఆ కంపెనీల్లో పనిచేస్తున్న 2300 మంది ఉద్యోగులకు ఇన్స్యూరెన్స్ చేయాలని, ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా చేరితే వాళ్ళ ఇన్స్యూరెన్స్ లన్నీ అతడి ద్వారానే చేయిస్తానని నమ్మబలికాడు.
ఒక్కో ఉద్యోగి రూ.10 వేల చొప్పున 2300 మంది చెల్లించే ఇన్స్యూరెన్స్ మొత్తం రూ.2.3 కోట్లు అవుతుందంటూ లేక్కలేసి చూపించాడు. ఆ మొత్తంలో 30 శాతం కమీషన్ గా వస్తుందని, అందులో 10 శాతం హెచ్ ఆర్ మేనేజర్లకిచ్చి మిగిలింది పంచుకుందామని ఆశ కల్పించాడు.
కమీషన్ కింద పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది కదా అనే ఆలోచనతో విక్టర్ ప్రతిపాదనకు మీర్జా ఖయ్యూం బేగ్ అంగీకరించాడు. అంతే - ఇక ఆ మొత్తానికి సెక్యూరిటీ డిపాజిట్ గా 1 శాతం, ఖర్చులకు రూ.10 వేలు ఇవ్వాలంటూ మొత్తం రూ.2.4 లక్షలు తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు.
ఎప్పుడు కాల్ చేసినా...
విక్టర్ మాటలు విని అతడి వలలో పడి అతడు అడిగిన నగదు ఇచ్చిన తర్వాత కొంతకాలంపాటు బేగ్ ఎదురుచూశాడు. డబ్బు తీసుకున్నాక ఉద్యోగుల ఇన్స్యూరెన్స్ ఊసే ఎత్తకపోవడంతో విక్టర్ కి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు బేగ్.
ఎప్పుడు ఫోన చేసినా తాను బిజీగా ఉన్నట్లు విక్టర్ నటించే వాడు. పూణేలోనో, ముంబైలోనో ఉన్నానని... ప్రముఖులు, సెలబ్రిటీలతోపాటు కొంతమంది మంత్రుల పేర్లు చెబుతూ వారితో మంతనాలు జరుపుతున్నానని, హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు.
ఇలా కొన్నాళ్ళు గడిచాకగాని బేగ్ కు అర్థం కాలేదు విక్టర్ అతడిని మోసం చేశాడని. చివరికి అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న ఇన్ స్పెక్టర్ కేవీఎం ప్రసాద్... ఏసీపీ కేసిఎస్ రఘువీర్ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలను బట్టి చివరికి బుధవారం విక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నోరు విప్పడంతో అతడి దురాగతాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందినా మరో ఇద్దరిని కూడా పోలీసులు గుర్తించారు. విక్టర్ బాధితులు నగరంతో పాటు చెన్నైలోనూ ఇంకా అనేక మంది ఉండచ్చని అనుమానిస్తున్నారు.