వ్యతిరేక శక్తులన్నీ కలిసొస్తేనే కొత్త పార్టీ... అది సాధ్యమేనా... ఇక కొండా దారి బీజేపీ వైపేనా...?
ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను కలిసి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త పార్టీ పెట్టడమా.. మరో పార్టీలో చేరడమా అన్నది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే... ఇక ఆయన బీజేపీలో చేరేందుకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్...
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తోందని... అందుకే టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్లో చేరానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పోరాడే తత్వాన్నే మరిచిపోయిందని.. ఇక ఆ పార్టీలో ఉండి లాభం లేదనుకుని బయటకొచ్చేశానని చెప్పారు. టీఆర్ఎస్ అరాచక పాలనను ఎండగట్టేందుకు తాను సిద్దమయ్యానని... టీఆర్ఎస్ వ్యతిరేకత శక్తులన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొస్తానని అన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్ని కలిసి వస్తే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమని... తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టలేనని తేల్చేశారు.
వ్యతిరేక శక్తులు కలిసొస్తే కొత్త పార్టీ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఒకవేళ టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో తాను బీజేపీలో చేరుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం,తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, మహబూబ్ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులను కలిశానని చెప్పారు. త్వరలోనే ఎంపీ రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని... రాష్ట్ర కాంగ్రెస్లో అనేకమంది కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. జూన్లో కాంగ్రెస్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇక దేశంలో ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవని, బీజేపీ హిందుత్వ పార్టీ అని అన్నారు.
అది సాధ్యమేనా...?
సొంతంగా పార్టీ పెట్టాలా ? లేక స్వతంత్రంగా పోటీ చేయాలా..? లేక బీజేపీలో చేరాలా..? ఇలా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కలిసొస్తే కొత్త పార్టీ పెడుతానని ఆయన చెబుతున్నారు. కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సారథ్యంలో పనిచేసేందుకు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ముందుకొస్తాయా...? అంటే కష్టమనే చెప్పాలి. కోదండరాం,చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమ నేతలు,ఇప్పుడిప్పుడే స్వతంత్రంగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్న లాంటి వారికి ఇప్పటికే జనంలో ఆదరణ ఉన్నది. చాలాకాలంగా వారు ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తున్నారు.
కానీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అలాంటి నేపథ్యమేదీ లేదు. ఆయన ఉద్యమ నేత కాదు,ఇప్పటివరకూ ప్రజల్లో ఉండి పోరాడింది లేదు.
పైగా కోదండరాం,చెరుకు సుధాకర్ తదితరులు ఇప్పటికే సొంత పార్టీలు పెట్టుకుని పనిచేసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి నేతలు.. పెడితే సొంతంగా పార్టీ పెట్టవచ్చు కానీ మరో నేత పెట్టే పార్టీలోకి వెళ్లే అవకాశం తక్కువనే చెప్పాలి. కాబట్టి టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటికైతే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ప్రయత్నాలేవో చేస్తున్నారు. అవి విఫలమైతే... తానే చెప్పినట్లు బీజేపీలో చేరుతాడు. కాబట్టి మొదటి ఆప్షన్ కంటే ఆయన బీజేపీలో చేరే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.