అడ్డుకున్నంత మాత్రాన పోరాటం ఆగబోదన్న ఐలయ్య; హౌజ్ అరెస్టే మంచిదన్న టీజీ..
విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్నంత మాత్రాన తన పోరాటం ఆగబోదని ఐలయ్య స్పష్టం చేశారు.
విజయవాడ: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా దళిత బహుజనులు తలపెట్టిన సభను పోలీసులు జరగనివ్వలేదు. ఏపీ డీజీపీ నుంచి అందిన ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నుంచి పోలీసులు ఐలయ్యను హౌజ్ అరెస్టు చేశారు.
శనివారం ఉదయం టీ-మాస్ ఫోరం సభ్యులు విమలక్క సహా పలువురు ఐలయ్య ఇంటికి చేరుకుని చర్చించారు. నిర్బంధాన్ని చేధించుకుని విజయవాడ వెళ్లాలని భావించినప్పటికీ.. పోలీసులు ఎక్కడికక్కడ వారిని అణచివేసే అవకాశం ఉండటంతో సభకు బయలుదేరలేదు.

ఎందుకీ వివాదం:
ఐలయ్యకు సంఘీభావంగా విజయవాడ జింఖానా గ్రౌండ్ లో సభ కోసం నెల రోజుల ముందే కార్పోరేషన్ వద్ద అనుమతి తీసుకున్నామని స్థానిక దళిత బహుజన నేతలు వై.కె, జయబాబు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో తాము కూడా అదే రోజు సభ నిర్వహిస్తామంటూ ఆర్యవైశ్య సంఘాలు బయలుదేరడం వివాదానికి దారితీసింది. అయితే తాము కూడా ముందే దరఖాస్తు చేసుకున్నామని, తమకు కూడా అనుమతనివ్వాలని వారు డిమాండ్ చేశారు.

పోలీసులు వాదన
అటు దళిత బహుజనులు, ఇటు ఆర్యవైశ్యులు ఇరువురు తమ సభ నిర్వహణల విషయంలో మొండి పట్టుతో ఉండటంతో.. పోలీసులు ఇద్దరికీ అనుమతులు రద్దు చేశారు. అయితే కార్పోరేషన్ మొదట తమకు అనుమతి మంజూరు చేసి.. ఇప్పుడెలా రద్దు చేస్తుందని దళిత బహుజన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉండటంతోనే ఎవరికీ అనుమతిలివ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

పోరాటం ఆగదు: ఐలయ్య
విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్నంత మాత్రాన తన పోరాటం ఆగబోదని ఐలయ్య స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను మున్ముందు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రైవేటు కంపెనీల్లో దళిత బహుజన యువతీ యువకులకు ఉద్యోగాలివ్వకపోతే.. వాటన్నింటిని జాతి వ్యతిరేక కంపెనీలుగా ముద్ర వేయాల్సి వస్తుందన్నారు.
రాత్రంతా తనను హౌజ్ అరెస్ట్ చేసి ఇద్దరు, ముగ్గురు పోలీసులను ఇంటి ముందు కాపలా పెట్టారని, ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవాళ్లలో ఎక్కువమంది దళిత బహుజనులే కాబట్టి, వారి జీతాలు పెంచాల్సిన అవసరముందన్నారు. ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యపై తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఐలయ్య డిమాండ్ చేశారు.

గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిది
ఐలయ్యను గృహ నిర్బంధంలో ఉంచినందుకు చంద్రబాబు, కేసీఆర్కి ఐలయ్య ధన్యవాదాలు తెలుపుకోవాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఐలయ్య విజయవాడకు వెళ్లి ఉంటే అక్కడి ప్రజలు ఆయనను కృష్ణా నది వరకు తరిమి కొట్టేవారని విమర్శించారు. ఆయన గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిదని అన్నారు. ఐలయ్యను అమెరికా మిత్రుడని అభివర్ణించారాయన.












Click it and Unblock the Notifications