గద్దర్ ఏం చెప్తారో: కెసిఆర్కు కలిసొచ్చిన ఓటుకు నోటు?
హైదరాబాద్: వామపక్షాలు ప్రజా గాయకుడు గద్దర్పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. సిపిఐ, సిపిఎంలతో పాటు ఇతర వామపక్ష పార్టీలు కూడా గద్దర్ను వరంగల్ లోకసభ బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గద్దర్ను పోటీకి దించడం ద్వారా తెలంగాణలోని ప్రతిపక్షాల ఐక్యతకు బాటలు వేయాలని కూడా వామపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పోరాటానికి విపక్షాల ఐక్యత చాలా అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ లోకసభకు పోటీ చేసేందుకు గద్గర్ సుముఖంగా ఉన్నారని తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం నిజామాబాదులో చెప్పారు. గద్దర్ పోటీ చేస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
అయితే, గద్దర్ ఏమనుకుంటున్నారనే విషయం తెలియడం లేదు. గద్దర్కు గతంలో ఇటువంటి ప్రతిపాదనలు చాలానే వచ్చాయి. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఆయన మెత్తబడుతున్నట్లు వీరభద్రం ప్రకటనను బట్టి అర్థమవుతోంది. కానీ, గద్దర్ పోటీ చేయడానికి సిద్ధపడుతారని ఆయన ప్రకటించేంత వరకు నమ్మడానికి లేదు.
కాగా, తెలంగాణలో కెసిఆర్ను ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు అంత సులభం కావడం లేదు. రైతుల ఆత్మహత్యల ఉదంతాలను తీసుకుని వామపక్షాలతో పాటు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కెసిఆర్ను చిక్కుల్లో పడేయాలని చూస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తున్నారనేది తెలియడం లేదు.
తెలంగాణకు ఇంకా ఆంధ్ర ఆధిపత్యవాదుల ముప్పు తొలగలేదనే వాదన కెసిఆర్కు బలాన్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 15 నెలలు గడిచాయి. నోటుకు ఓటు వ్యవహారం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సెక్షన్ 8ను ముందుకు తేవడం కెసిఆర్కు కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాదుపై ఆంధ్ర ఆధిపత్యవాదులు పట్టును సాధించడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణకు చెందిన మేధావులు కాస్తా బలంగానే వినిపిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు అంత మద్దతు లభిస్తున్నట్లు లేదు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఆయన సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర జరిగిందని నోటుకు ఓటు కేసు ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రచారం సాగించడంలో ఫలితం సాధించినట్లే కనిపిస్తోంది.
కెసిఆర్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే అంచనాకు రావడం సరైంది కాదనే భావన తెలంగాణలో బలంగా ఉంది. ఆంధ్ర ఆధిపత్యవాదుల ప్రయత్నాలు పూర్తిగా సమసిపోయే వరకు వేచి చూడడమే కాకుండా, సమస్యల పరిష్కారానికి కెసిఆర్కు ఇంకా కొంత సమయం ఇవ్వడం మంచిదని అంటున్నారు. దీంతో ప్రతిపక్షాలు బలం పుంజుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే గద్దర్ వరంగల్లో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.