వరంగల్ ప్రచారానికి వైయస్ షర్మిల దూరం: ఎందుకు?
వరంగల్: తెలంగాణ బాధ్యతలు చేపట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల ఓదార్పు యాత్రను చేపట్టి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ప్రయత్నించిన ఆమె ప్రచారానికి దూరంగా ఉండడంలోని ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.
అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వరంగల్ లోకసభ స్థానంలో నల్లా సూర్యప్రకాష్ను తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రచారం చేస్తూ క్యాడర్ను సమన్వయపరిచే పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీ శాసనసభ్యురాలు రోజా వరంగల్లో ప్రచారం నిర్వహించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా వరంగల్లో ప్రచారం సాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బొత్స సత్యనారాయణ కూడా ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకులు వరంగల్లో ప్రచారానికి వస్తుంటే, తెలంగాణ బాధ్యతలు చూస్తున్న వైయస్ షర్మిల రాకపోవడం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె దూరంగా ఉండడం పట్ల పార్టీలో అసంతృప్తి కూడా చోటు చేసుకుందని అంటున్నారు.
కాగా, వరంగల్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే షర్మిల విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. తాను ప్రచారం చేయడం వల్ల కూడా ఏమీ ఉపయోగం ఉండదనే భావనతోనే ఆమె దూరంగా ఉంటున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. మొత్తం మీద ఆమె ప్రచారానికి రాకపోవడంపై చర్చ సాగుతోంది.