TTD: శ్రీవారి హుండీలో పాకిస్థానీ కరెన్సీ! మరో 157 దేశాల కరెన్సీ నోట్లు కూడా
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నిత్యకళ్యానం పచ్చతోరణం అన్నట్లుగా ఎప్పుడూ వెలిగిపోతూనే ఉంటుంది. వేలాది భక్తులు ప్రతి రోజూ స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమకు తోచినంత వివిధ రూపాల్లో విరాళాలను అందజేస్తుంటారు. డబ్బులు, ఆభరణాలు, ఇతర సామాగ్రి, వాహనాలు విరాళంగా వస్తుంటాయి.

టీటీడీ హుండీలో పాకిస్థాన్ కరెన్సీ సహా 157 దేశాల కరెన్సీ
తెలుగు రాష్ట్రాలతోపాటు మనదేశంలోని అనేక ప్రాంతాలు, ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉంటున్న భక్తులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు. కొందరు విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి కరెన్సీనే తిరుమల దేవస్థానం హుండీల్లో వేస్తుంటారు. ఇలా 157 దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో కానుకలుగా వచ్చాయి. కాగా, పాకిస్థానీ కరెన్సీ కూడా ఇందులో ఉండటం గమనార్హం.

తొలి స్థానం మలేషియా కరెన్సీ, తర్వాత అమెరికా డాలర్లు
ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆదాయం గల పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంకు కరోనా మహమ్మారి కారణంగా భక్తుల రాక తగ్గడంతో కానుకలు కూడా తగ్గిపోయాయని అధికారులు తెలిపారు. కాగా, శ్రీవారి హుండీలో అత్యధికంగా మలేషియా కరెన్సీ నోట్లు 46 శాతం వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉంటున్నాయి. శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు 16 శాతం ఉన్నట్లు గతంలో టీటీడీ వెల్లడించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ దేశానికి చెందిన కరెన్సీ నోట్లు కూడా ఉండటం.

కరోనాతో తగ్గిన ఆదాయం.. విదేశీ కరెన్సీ నోట్ల ఆదాయం ఇలా..
2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది విదేశీ కరెన్సీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.
ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 మధ్య, హుండీకి 1.92 కోట్ల రూపాయల విలువైన 30,300 విదేశీ కరెన్సీ నోట్లు మాత్రమే వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ దేశంలో పెరగక ముందు ఏప్రిల్ 2021లో హుండీకి 37,22,809 రూపాయల విలువైన 4779 విదేశీ కరెన్సీ వచ్చింది. భారత కరెన్సీతో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి ఆలయానికి 1,131 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవిగాక, టీటీడీలో సుమారు 9 వేల కిలోగ్రాముల బంగారు నిల్వ ఉందని తెలిపారు. మరోవైపు 2016లో పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత రద్దయిన నోట్లను భక్తులు భారీ మొత్తంలో శ్రీవారి హుండీలో వేశారు. సుమారు 50 కోట్ల రూపాయలు టీటీడీ వద్దే ఉండిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి కూడా టీటీడీ తీసుకెళ్లింది.












Click it and Unblock the Notifications