బాబుకు పట్టిన గతే కేసీఆర్కు.. జీవీఎల్ విసుర్లు
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే పడుతుందని కామెంట్స్ చేశారు. వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి జాతీయ స్థాయి నేతలు, ప్రాంతీయ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మూడు రోజులుగా ఢిల్లీ, పంజాబ్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్తో సమావేశం అయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికి కొల్పొతున్న తరుణంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో 'డ్రామా రాజకీయలకు' తెరతీశారని విమర్శించారు. ఇలాంటి రాజకీయలనే గతంలో చంద్రబాబు చేశారని.. ఆ తర్వాత అధికారం కోల్పోయారని కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో, ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా అలానే బీహెవ్ చేస్తుందని అన్నారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు లేకపోయినా..తామేదో చేస్తామనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో జాతీయ పర్యటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ రైతులకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. యూపీలో రైతులు లేరా.. అక్కడ మరీ బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం ఉందని జీవీఎల్ అన్నారు.