సోనియాకు కెసిఆర్ పాట్లు
మొత్తం మీద, తెలంగాణపై కెసిఆర్ మరోసారి కదలిక తెచ్చారు. ఈ స్థితిలో తెలంగాణపై ఏం చెప్పించాలనే విషయంపై సోనియా గాంధీ తీవ్రంగా మథనపడుతున్నట్లు సమాచారం. పాత పాటే పాడితే చెల్లే అవకాశం లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఓసారి ఏర్పాటు చేశారు. మరో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి దాటవేశారు. తెలంగాణ అంశంపై సాచివేత వైఖరి అవలంబించే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సందర్భంలో కెసిఆర్ మరోసారి ముందుకు వచ్చారు.
కెసిఆర్ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించి ఆందోళనకు దిగితే తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనే ఆందోళన సోనియాలో పొడసూపినట్లు చెబుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తమలో తాము చర్చించుకుంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ అంశానికి తామే చాంపియన్లమని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో అధిష్టానానికి, సోనియాకు వారు ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తారనేది కూడా చర్చనీయాంశమే అయింది. ఏమైనా, తెలంగాణ అంశంపై కెసిఆర్ను ఒప్పించేలా సోనియా ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేది ఆసక్తిగానే ఉంది.