విభజన: నీటి సమస్య పరిష్కారానికి మండలి
రాష్ట్ర విభజన అంశంలో హైదరాబాద్, నీరు సంక్లిష్ట సమస్యలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన అనంతరం హైదరాబాదును పదేళ్ల పాటు గవర్నర్ పాలనలో ఉంచాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. క్లిష్టంగా మారిన నీటి పంపిణీకి సర్వోన్నత మండలిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. కృష్ణా, గోదావరి జలాల పర్యవేక్షణను ఈ సర్వోన్నత మండలి చేతిలోనే ఉంచాలని భావిస్తున్నారు.
సమాచారం మేరకు... ఈ మండలికి అధ్యక్షుడిగా జల వనరుల మంత్రి ఉంటారు. సభ్యులుగా రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఉంటారు. మండలికి అనుబంధంగా రివర్ బోర్డు ఉంటుంది. జలాశయాల నిర్వహణకు సిఐఎస్ఎఫ్ భద్రత ఉంటుంది. నికర జలాల వాటాలో ఎలాంటి మార్పులు చేయకూడదని అలాగే పాత ప్రాజెక్టుల నీటి లభ్యతపై కొత్త ప్రాజెక్టుల ప్రభావం ఉండకూడదని భావిస్తున్నారు.
కృష్ణా, గోదావరి జలాలపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే సర్వోన్నత మండలి తుది ఆమోదం పొందాల్సిందే. దీనికి సహకరించేందుకు రివర్ బోర్డు ఉంటుంది. విభజన బిల్లులోనే వీటి ఏర్పాటు గురించి స్పష్టీకరిస్తారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వస్తే రివర్ బోర్డు పూర్తి బాధ్యతలు తీసుకొని సాంకేతిక అనుమతులు మంజూరు చేసి తుది ఆమోదానికి సర్వోన్నత మండలికి పంపిస్తుంది.
మిగిలు జలాల విషయంలో తొలుత తాగునీటికి ప్రాధాన్యం ఇస్తారు. తాగునీటికి ఇబ్బంది లేకపోతేనే సాగుకు ఇస్తారు. తాగు, సాగునీటి అవసరాలతో వివాదం లేనప్పుడే విద్యుత్కు ఇస్తారు. ఇక తుంగభద్ర నిర్వహణ పైన ప్రస్తుతం ఓ బోర్డు ఉండగా, విభజన తర్వాత కర్నాటకతో పాటు తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులు ఉంటారు.