టెక్కీ స్వాతి కిల్లర్ను చూసేందుకు ఎగబడ్డారు
చెన్నై: సాఫ్ట్వేర్ ఇంజనీరు స్వాతి హత్య సంఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. స్వాతిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న రామ్ కుమార్ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. చెన్నైలోని ప్రభుత్వ రోయప్పెట ఆస్పత్రి వెలుపల పెద్ద యెత్తున ప్రజలు గుమికూడారు.
సోమవారం ఉదయం నుంచి అతన్ని చూడడానికి ప్రజలు తీవ్రమైన ఆసక్తి కనబరిచారు. పోలీసులను చూడగానే గొంతు కోసుకన్న రామ్ కుమార్ను పోలీసులు ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే, రామ్ కుమార్ను చూడడానికి సందర్శకులకు వీలు కాలేదు.
రామ్ కుమార్ను ఉంచిన ఐసియు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు అతన్ని చూడలేక, కాసేపు ఆస్పత్రి వద్ద నిరీక్షించి వెళ్లిపోతూ వచ్చారు. స్వాతి హత్య సృష్టించిన భయానకమైన, దిగ్భ్రాంతికరమైన ఛాయలు మాత్రం వారి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి.
ప్రజలు టీవీ చానెళ్లకు అతుక్కుపోవడం కూడా కనిపించింది. రామ్ కుమార్ ఆరోగ్యం మెరుగు పడి అతనేమైనా మాట్లాడుతాడమోననే ఆసక్తి వారిలో కనిపించింది. దేశమంతటి నుంచి వచ్చిన జర్నలిస్టులతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది.
ఆస్పత్రి లోపల, బయట ఓబీ వ్యాన్లు, ప్రెస్ వాహనాలు, పోలీసు వాహనాలు పార్కు చేసి ఉన్నాయి. దాంతో రోగులు, దారిన వెళ్లేవారు దాన్నంతా ఆసక్తిగా గమనించడం కూడా కనిపించింది. కొంత మంది తమ పనులను, ప్రయాణాలను ఆపుకొని ఆస్పత్రి గేటు వద్ద కాపు కాయడం కూడా కనిపించింది. రామ్ కుమార్ కనిపిస్తాడేమోననే ఆసక్తి వారిలో కనిపించింది.
ఆస్పత్రి వద్ద పెద్ద యెత్తున ప్రజలు గుమికూడడంతో దారిన పోయే వాహనాలు కూడా వేగం తగ్గించాయి. డ్రైవర్లు వేగం తగ్గించుకుని ఆసక్తిగా ఆస్పత్రి గేటు వైపు చూడడం కనిపించింది. మైకులు, కెమెరాలతో వచ్చిన రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు నిందితుడి బ్లాక్ ప్రవేశ ద్వారం వద్దనే నిలిచిపోయారు. వారిని సెక్యూరిటీ గార్డులు లోనికి అనుమతించలేదు.
వైద్యులు ఎప్పటికప్పుడు మీడియాకు రామ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ వచ్చారు. అదే సమయంలో పోలీసులు కూడా వీడియో చానెళ్లకు అతని పరిస్థితి గురించి వివరిస్తూ వచ్చారు.