ఓటుకు నోటు కేసులో ట్వీస్ట్: కెసిఆర్కు కూడా షాక్, ఇదీ జరిగింది...
రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఇది కెసిఆర్కు కూడా షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు...
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ కేసు మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసు తీసుకున్న మలుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కూడా షాక్ ఇచ్చేట్లు ఉంది.
ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా ప్రచురించింది. ఆ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఇటీవల చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ చార్జిషీట్ కాస్తా రాజభవన్కు చేరింది. ఇది సంచలనం సృష్టిస్తోంది.
ఎసిబి డైరెక్టర్ చారుసిన్హాను రాజభవన్ అధికారులు పిలిపించుకుని చార్జిషీట్ కాపీలను తీసుకున్నారు. అది వచ్చిన కొద్ది రోజులకే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాజభవన్ చార్జిషీట్ తీసుకున్న విషయం తెలంగాణ ప్రభుత్వానికి ఆలస్యంగా తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా ఇంకా నరసింహనే ఉన్నారు. రాజభవన్ నుంచి ఏ విధమైన ఆదేశాలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సిందే. నేరుగా రాజభవన్ వర్గాలు ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయవచ్చు. అలాంటి ఉదంతాలు గతంలో కూడా జరిగాయి.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన చార్జిషీట్ను చారు సిన్హా గవర్నర్కు అందజేశారు. అయితే, గవర్నర్కు ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ ఆ విషయాన్ని సిన్హా దాచి పెట్టారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహానికి గురైంది. అదే అదునుగా చారుసిన్హాను బదిలీ చేసారు.
ఎసిబి డైరెక్టర్ జనరల్గా ఉన్న ఎకె ఖాన్ గతంలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు. అయితే, సర్వీసులో ఉన్నంత వరకే ఆయనకు పర్యవేక్షణ అధికారం ఉంటుంది. ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి లేదు. కానీ పదవీ విరమణ చేసిన నెలన్నర తర్వాత ఆయన ఎసిబి కార్యాలయానికి వెళ్లారు.
అప్పటి డైరెక్టర్ జనరల్ చారు సిన్హాకు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన ఎసిబి కార్యాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆ సమీక్ష జరిగింది. అదే రోజు సాయంత్రం దర్యాప్తు అధికారులు న్యాయస్థానంలో అదనపు చార్జిషీట్ దాఖలు చేశారు.
తన ప్రమేయం లేకుండా ఎకె ఖాన్ సమీక్ష నిర్వహించడంతో చారు సిన్హా తీవ్ర అసహనానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా రాజభవన్ దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో రాజభవన్ వర్గాలు నేరుగా అదనపు చార్జిషీట్ కాపీలను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం.
గత నెల 18వ తేదీన ఓటుకు నోటు కేసులో ఎసిబి అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ మర్నాడు రాజభవన్కు కాపీలు చేరాయి. తర్వాత పది రోజులకు గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి, ప్రధానులనే కాకుండా ఆయన అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, తదితర ప్రముఖులను ఆయన కలుసుకున్నారు.
సమీక్షకు చారు సిన్హా సహకరించలేదని ఎకె ఖాన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాజభవన్కు కాపీలు పంపి సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఎకె ఖాన్కు సహకరించకపోవడంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వం చారు సిన్హాను బదిలీ చేసినట్లు చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసులో ఎసిబి దాఖలు చేసిన అదనపు చార్జిషీట్లో టిడిపి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ల మధ్య జరిగిన సంభాషణను ప్రధానంగా ప్రస్తావించారు. టిడిపి మహానాడు జరిగిన సాయంత్రం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేయ స్ఠీఫెన్సన్ను కలవాలని ఆ సంభాషణలో ఉన్నట్లు ప్రస్తావించారు.
తమ అధినేత చెప్పిన వివరాలను స్టీఫెన్ సన్కు చెప్పాలనే విషయాన్ని వారిద్దరు చర్చించుకున్నట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. స్టీఫెన్సన్ను తమ వైపునకు తిప్పుకోవాలని, ఆయనకు నమ్మకం కలిగించి ఓటు వేసేలా ధైర్యం చెప్పాలని కూడా వారిద్దరు మాట్లాడుకున్నట్లు ప్రస్తావించారు.
స్టీఫెన్సన్కు సెబాస్టియన్ను పరిచయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన జెరూసలెం మత్తయ్య వ్యవహారాన్ని ఎసిబి చార్జిషీట్లో ప్రస్తావించింది. వారిద్దరితో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీర్య తెలిపినట్లు కూడా చార్జీషీట్లో చెప్పారు.