ఏపీతో పోటీ! అక్కడ వందఅంతస్తుల టి సచివాలయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతివ్యాధుల ఆసుపత్రి స్థలంలోకి మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం యోచిస్తోంది. ఆధునాతన వసతులతో దాదాపు వంద అంతస్థులతో భారీ సముదాయాన్ని నిర్మించాక సచివాలయాన్ని అందులోకి మార్చాలని భావిస్తున్నారు.
మంత్రులు, అధికారుల నివాసాలను కూడా నిర్మించాలని భావిస్తున్నారు. మిగిలిన స్థలాన్ని స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు అనువైన విశాల మైదానంగా మార్చాలని చూస్తున్నారు. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కేసీఆర్ ఇటీవలే ఆసుపత్రిని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు.
ఛాతి వ్యాధుల ఆసుపత్రి కాలుష్యానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉండాలని, ప్రస్తుతం నగరం నడిమధ్యలో ఉండటం వల్ల కాలుష్యంతో పాటు ఇతర సమస్యలు ఎదురువుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఛాతివ్యాధుల ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి మార్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సచివాలయం 21 ఎకరాల్లో ఉండగా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి.
ఈ సచివాలయం అనువుగా లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, ఇరుకు పలు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సువిశాల మైదానంలోకి మార్చాలని భావిస్తున్నారు. ఛాతి ఆసుపత్రి 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వంద అంతస్తుల భవన సముదాయం, నివాస గృహాలంతో పాటు మైదానాన్ని ఇందులో నిర్మించవచ్చునని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం పదేళ్ల పాటు ఉండే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం త్వరగా సచివాలయం నిర్మించుకొని, వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందే వెళ్లవచ్చు. ఏపీ సచివాలయం తరలిపోయే నాటికి తెలంగాణ సచివాలయం పూర్తి చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా.. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయం ఉన్న స్థలంలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలని నిర్ణయించారని సమాచారం. సాగర్ చుట్టు భవంతులు నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.