కేసీఆర్ అలా అనగానే అందరూ నవ్వారు: ఎందుకు?(పిక్చర్స్)
పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. దేశంలోనే రెండో నగదు రహిత గ్రామంగా సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామం నిలిచిన నేపథ్యంలో మరిన్ని గ్రామాలు ఈ బాటలో నడిచేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సిద్దిపేటలో నగదురహిత లావాదేవీలపై జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అందర్నీ నవ్వించారు. అసలేం జరిగిందంటే.. '
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నగదు రహిత లావాదేవీలపై వివరిస్తున్నారు. అంతలో, కేసీఆర్ లేచి నుంచున్నారు. 'కలెక్టరు గారూ.. మాది గజ్వేల్. నేను గజ్వేల్ ఎమ్మెల్యేని కూడా. నగదురహితంపై మీరు కాస్తా మా నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవాలి'' అని కేసీఆర్ అన్నారు. దీంతో అక్కడున్న అధికారులు, నాయకులంతా గట్టిగా నవ్వేశారు.
ప్రజలకేం కావాలో తెలుసుకోండి
‘ఇప్పటి వరకూ రాష్ట్రంలో భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అనే క కార్యక్రమాలను అమలు చేశాయి. అయినా, సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉన్నట్లుంది. లోపం ఎక్కడుందో మీరే గుర్తించాలి. ప్రజలకేం కావాలో తెలుసుకోండి. పరిష్కారాలు వెతకండి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది' అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నో యువర్ డిస్ట్రిక్ట్
అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలని, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకు రావాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘నో(Know) యువర్ డిస్ట్రిక్ట్. ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్' మార్గదర్శకాల పుస్తకం, సీడీని సీఎం ఆవిష్కరించారు.
నగదు రహిత లావాదేవీలపై..
సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభోపన్యాసం చేయగా.. సమావేశం ఉద్దేశాలను సీఎస్ ప్రదీప్చంద్ర వివరించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిద్దిపేటలో నగదు రహిత లావాదేవీలపై కలెక్టర్ వెంకట్రామ్రె డ్డి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
సులువేం కాదు
‘సమాజంలో అపసవ్య పరిస్థితులను అరికట్టడం సులువేం కాదు. ప్రభుత్వం అంటే కేవలం మంజూరీలు ఇవ్వడం కోసం మాత్రమే అనే అభిప్రాయం ఉంది. కేవలం డబ్బులతోనే అన్ని పనులూ కావు. మంచి పాలసీలు, పథకాలు రావాలి. ప్రజల జీవితాల్లో మార్పునకు కారణం అవే కావాలి' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు కలిసికట్టుగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, సంఘటితంగా పనిచేసి ప్రజలకు మేలైన సేవలందించాలని కోరారు.
అందుకే కొత్త జిల్లాలు
‘అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలు కావాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. పరిపాలన విభాగాలు వికేంద్రీకరించుకున్నాం. వాటి ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలంగా ఉండాలి' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ బాగా జరుగుతోందని, మంచి వర్షాలు కురవడంతో చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోందని, చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల కట్టడి
అక్కర లేకున్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ఆపరేషన్లను కట్టడి చేయడానికి, కఠిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేయాలని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో కల్తీకారం ఘటనపై కన్నెర్ర చేసిన సీఎం.. కల్తీ ఎందులో ఉన్నా ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. ఎరువులు, విత్తనాలు కల్తీవి అమ్మితే వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని, ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆహార పదార్థాల కల్తీ నూటికి నూరుశాతం ఆగిపోవాలని, ఇందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అక్రమార్కులను పట్టుకోవాలన్నారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్ అలీ, మంత్రులు, సీఎస్ ప్రదీప్ చంద్ర, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు.
నగదు రహిత రాష్ట్రంగా మార్చండి
రాష్ట్రాన్ని నగదు రహిత రాష్ట్రంగా మార్చడానికి కలెక్టర్లు పోటీ పడాలని, నగదు రహిత లావాదేవీలను పెంచే ప్రక్రియను చాలెంజ్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణనివ్వాలని కోరారు. ‘నగదు రహిత లావాదేవీల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అందరికంటే ముందుంది. ప్రధాని, ఆర్థిక మంత్రి కూడా అభినందనలు తెలిపారు. సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. అక్కడి అనుభవాలను ఉపయోగించుకొని అన్ని జిల్లాల్లో నగదు రహిత లావాదేవీల దిశగా చర్యలు తీసుకోవాలి' అని సీఎం చెప్పారు.
స్వైపింగ్ మిషిన్లు అందించాలి
బ్యాంకు లావాదేవీలు, ఆనలైన వినియోగం, మొబైల్ యాప్ల వినియోగం పెరగాలని, వాటిపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలని, ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. బ్యాంకులు కూడా స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తేవాల్సి ఉందని, సర్వర్ల సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని, ఈ మేరకు బ్యాంకర్లతో మాట్లాడుతున్నానని వివరించారు. జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ బ్యాంకర్లతో సమావేశాలు పెట్టుకోవాలని, మానవ వనరులను గుర్తించి. వారికి శిక్షణ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స కలిగిన వ్యాపారులను గత లావాదేవీల వివరాల కోసం వేధించవద్దని, ఆ లెక్కలను పరిగణనలోకి తీసుకొని పన్నులు, ఛార్జీలు వసూలు చేయరాదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
ప్రశాంత్ రెడ్డి కూడా మంత్రే
మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డిని కూడా మంత్రిగానే పరిగణించి అధికారులందరూ ఆయనకు సహకరించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్కు ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానించిన విధంగానే బుధవారం ప్రగతి భవన్లో జరిగిన కలెక్టర్ల మీటింగ్కూ సీఎం ఆయనను ఆహ్వానించారు.